అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ -ఒక్కొక్కరి నెత్తిన రూ.70వేల భారం -కాగ్ సంచలన రిపోర్టు -జగన్ సర్కార్ మౌనం
ఏడేళ్ల కిందట రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఏరకంగానూ కోలుకోలేకపోవడం అటుంచితే, అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఏడాదిన్నర కిందట వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 'అప్పు చేసి పప్పు కూడు' అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించే స్వంత్ర ప్రతిపత్తి గల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఈ సంచలన విషయాన్ని నివేదించినట్లు 'టైమ్స్ నౌ' మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
Recommended Video
రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకి
పరిమితిని మించి అప్పులు..
కాగ్ తాజా నివేదిక ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు స్థూల రుణ భారం ఏకంగా రూ.3,73,140 కోట్లకు చేరింది. గతేడాది(2020) నవంబర్ చివరి నాటికి ఏపీ అప్పు ఈ స్థాయిలో ఉండగా, 2020 డిసెంబర్, 2021 జనవరిలో భారం ఇంకా పెరగనుంది. గతేడాది(2020) ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో రుణ భారం ఏకంగా రూ.73,811 కోట్లు పెరిగిందని కాగ్ వెల్లడించింది. సాధారణంగా అయితే ఏడాది మొత్తానికి వార్షిక రుణ లక్ష్యం రూ.48,295 కోట్లుకాగా, ఈ టార్గెట్ను మించి సర్కారు అప్పులు చేస్తోందని కాగ్ పేర్కొన్నట్లు ‘టైమ్స్ నౌ' కథనంలో రాశారు.
అప్పులతో సంక్షేమం.. మనిషికి రూ.70వేలు
పాత పథకాలకుతోడు, జగన్ పాలనలో కొత్తగా పురుడుపోసుకున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో ప్రతిపనీ అప్పులతోనే నడుస్తోందని, ఒక్క నవంబర్ నెలలోనే ఉచిత పథకాల కోసం ప్రభుత్వం రూ.13,001 అప్పు చేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ లెక్కన అప్పులను రాష్ట్రంలోని 5.39 కోట్ల మందికి విభజిస్తే ఒక్కొక్కరిపై రూ.70వేల వరకు భారం పడనుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ఉచిత పథకాలు, మరిన్ని అప్పుల వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ బీజేపీకి చెందిన ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే ఫిర్యాదు లేఖలు రాయడం తెలిసిందే. నిజానికి ఏపీలో..
నానాటికీ పెరుగుతోన్న రెవెన్యూ లోటు
రూ.18,434.15 కోట్లుగా ఉన్న రెవెన్యూ లోటు కాస్తా గతేడాది నవంబర్ చివరి నాటికే ఏకంగా రూ.57,925.47 కోట్లకు పెరిగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నెలకు సగటున రూ.9226.35 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు అంటే 2021 మార్చి 31లోపు ఏపీ సర్కారు మరో రూ.30,000 కోట్లు అప్పుచేసే అవకాశముందని కాగ్ తెలిపింది. 2020-21లోనే ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.03 లక్షల కోట్లకు చేరునుందని ఆర్థిక వర్గాల అంచనాగా ‘టైమ్స్ నౌ' పేర్కొంది. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ లో ఏపీపై అప్పుల భారం రూ.97,000 కోట్లు ఉండగా, చంద్రబాబు దిగిపోయేనాటికి, అంటే 2019 మార్చి నాటికి ఏపీ అప్పు రూ.2,58,928 కోట్లకు చేరింది. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే, అంటే 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ప్రభుత్వం.. వివిధ మార్గాల్లో రూ.1,14,212కోట్లు అప్పు చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని తొలి 8 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.70,082.90 కోట్ల రాబడి వ్యయాన్ని ఉచిత పథకాలకే ఖర్చు చేసింది.
పన్నుల భారం పెంచినా..
రెవెన్యూ లోటును, అప్పుల భారాన్ని తగ్గించుకునే దిశగా సర్కారు కొన్ని ప్రయత్నాలు చేసింది. కొవిడ్ లాక్ డౌన్ నష్టాన్ని సాకుగా చూపిస్తూ ప్రజలపై రూ.21,000 కోట్ల పన్నుల భారం వేసింది. లాక్ డౌన్ ను పక్కనబెడితతే ఏపీ ప్రభుత్వానికి గతేడాది నవంబర్ నాటికి రూ.46,589 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్ధిక సంవత్సరంలోని రాబడి (రూ.4,500 కోట్లు) కంటే ఇది తక్కువ. మరోవైపు కేంద్రం నుంచి ఏపీ రూ.8వేల కోట్ల అదనపు గ్రాంట్ ను తెచ్చుకుంది. కార్పొరేషన్ల ద్వారా పలు బ్యాంకుల నుంచి మరో రూ.10వేల కోట్లను సమీకరించుకుంది. ఒక్క అమ్మఒడి పథకానికి అయ్యే రూ.6,500 కోట్లు ఖర్చులో రూ.3వేల కోట్లను ఎస్బీఐ నుంచి అప్పుగా తీసుకోనుంది.
అప్పుల్లో టాప్.. అభివృద్ధిలో డ్రాప్
ఏపీ సర్కారు ప్రస్తుత పరిస్థితి ‘అప్పు చేసి పప్పు కూడు' తరహాలో ఉందని, వచ్చే ఏడాది నుంచి రూ.35 వేల కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి రావొచ్చని, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇతర ఖర్చులకే సరిపోతుందని ఆర్థిక నిపుణులు, అధికారులు వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. జగన్ సర్కారు 19 నెలల్లోనే రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, అదే సమయంలో ప్రజలపై రూ.75వేల కోట్ల పన్నుల భారం వేసిందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో టాప్ లో ఉండగా.. అభివృద్ధిలో అట్టడుగున ఉందని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శించారు. ఏపీ అప్పుల భారానికి సంబంధించి కాంగ్ రిపోర్టుపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయం తీసుకునేందుకు సంప్రదించగా, ఆయన స్పందించలేదని ‘టైమ్స్ నౌ' కథనంలో రాశారు.
రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు