సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ థాంక్స్ -పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది : ఆ సమస్యలపైనా...!!
కొంత కాలంగా ఏపీలో చర్చనీయాంశంగా మారిన సినీ ఇండస్ట్రీ అంశాలు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలోనే చిరంజీవి నాయకత్వంలో సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా కొన్ని సమస్యలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ టిక్కెట్ల ప్రతిపాదన మరో వివాదాస్పద అంశంగా మారింది. దీని పైన చర్చ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు.
పవన్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
తన మీద కోపంలో సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టవద్దంటూ వ్యాఖ్యానించారు. దీని పైన ప్రభుత్వం నుంచి గట్టిగానే రియాక్షన్ వచ్చింది. సినీ పెద్దల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ఆన్ లైన్ టిక్కెట్ల విధానం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయం లో పవన్ వ్యాఖ్యలపైన స్పందనలో భాగంగా..ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతుందా..దీని పైన స్పందించాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసారు. దీంతో..తెలుగు ఫిలం ఛాంబర్ ఆప్ కామర్స్ పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని..తాము రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కోరుకుంటున్నామని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం స్పందించాలని వినతులు
ఇక, చిరంజీవి..అల్లు అరవింద్..నాగార్జున వంటి వారు సైతం ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలవాలని..సహకారం అందించాలని కోరారు. ఇక, ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పట్టటంతో అన్ని ధియేటర్లలోనూ వంద శాతం ఆక్యుపెన్సీ.. నాలుగు షో ల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కరోనా సమయం నుంచి ధియేటర్లు మూసివేతతో పాటుగా..కొద్ది నెలల క్రితం 50 శాతం ఆక్యపెన్సీతో అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు కరోనా ముందు ఏ విధంగా ధియేటర్లలో సినిమా ప్రదర్శనలు జరిగేవే అదే తరహాలో కొనసాగింపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వం కీలక నిర్ణయంతో
దీని పైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశమైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్..మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 'మా సినిమా ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రలో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది. మా సమస్యలను ప్రభుత్వాలకే చెప్పుకుంటామని స్పష్టం చేసారు.
ఫిలిం ఛాంబర్ సీఎంకు థాంక్స్
రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాటిని పరిష్కరించండి. టిక్కెట్ రెట్లు, కరెంట్ బిల్లులు మొదలగు సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాము' అని తెలిపారు. ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... 'వంద శాతం ఆక్యుపెన్సి జీవో ఇచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. షూటింగ్లకు పర్మిషన్, కరెంట్ బిల్లులు ఆన్లైన్ టిక్కెట్ రేట్లతో పాటు మిగిలిన సమస్యలను పరిష్కరించండి' అని కోరారు.
Recommended Video
ఇతర సమస్యల పైనా ఫోకస్
దీంతో..ఇతర సమస్యల పైనా ప్రభుత్వం త్వరలోనే సినిమా పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వారి సమస్యల పరిష్కారానికి తాము సహకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో..సినీ పరిశ్రమ - ఏపీ ప్రభుత్వ నిర్ణయాల పైన కొద్ది రోజులుగా నడుస్తున్న చర్చకు ముగింపు రానుంది. అయితే, ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం ముందుకే వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.