విభజన సమస్యలపై ఇప్పటికైనా తేల్చండి-అమిత్ షాను కోరిన బుగ్గన-సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో
ఎనిమిదేళ్ల క్రితం ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత తలెత్తిన పరిస్ధితులు, అప్పటినుంచీ పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఇప్పటికైనా పరిష్కరించాలని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. కేరళలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీలో సీఎం జగన్ కు బదులుగా హాజరైన బుగ్గన కీలక ప్రసంగం చేశారు. ఇందులో విభజన సమస్యల వల్ల ఏపీపై పడుతున్న ప్రభావాన్ని అమిత్ షా కు గుర్తుచేశారు.
విభజన హామీల అమలు కోసం ప్రత్యేక సంస్ధలు,లేదా వ్యవస్ధలు ఏర్పాటు చేసి సమస్యల్ని త్వరిత గతిన పరిష్కరించాలన్నారు.

సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం వరుసగా ఏర్పాటుచేస్తున్న జోనల్ కౌన్సిల్ 30వ భేటీ ఇవాళ కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వివిధ కారణాలతో సీఎం జగన్ ఈ భేటీకి హాజరుకాలేదు. దీంతో జగన్ తరఫున ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన ఏపీ వాణిని వినిపించారు.

దశాబ్దం కావస్తున్నా విభజన హామీల అమలేదీ ?
ఇవాళ జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో బుగ్గన రాజేంద్రనాథ్ ప్రధానంగా ఏపీకి అవసరమైన విభజన హామీల అమలుపై తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమ రాష్ట్ర విభజన ఎంత అశాస్త్రీయంగా జరిగిందో అందరికీ తెలుసని బుగ్గన గుర్తుచేశారు. దీన్ని ఇప్పటికే నీతి ఆయోగ్ తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు గుర్తించాయన్నారు.
విభజన జరిగి దాదాపు దశాబ్దం పూర్తవుతున్నా ఇప్పటికీ విభజన హామీల్ని కేంద్రం అమలు చేయడం లేదని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిరుపతిలో జరిగిన 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ విభజనకు సంబంధించిన ఏడు అంశాల్ని ప్రస్తావించారని బుగ్గన గుర్తుచేశారు. ఇప్పటికీ వాటి అమలు జరగలేదన్నారు.

ఇంకా పెండింగ్ సమస్యలివే..
విభజన హామీల్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు కట్టిస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, దీన్ని త్వరగా పూర్తిచేసి ఇచ్చేందుకు రాష్ట్రం కేంద్రం నుంచి నిరంతర సహకారం ఆశిస్తోందని బుగ్గన తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అప్పట్లో ప్రధాని హామీ ఇచ్చారని, దీనికి రూ.24500 కోట్లు అవసరమని తాము డీపీఆర్ ఇస్తే కేవలం రూ.2100 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. దీన్ని సవరించి నీతి ఆయోగ్ నుంచి రూ.25వేల కోట్లు ఇప్పించాలని కోరారు. హైదరాబాద్ కోల్పోవడం వల్ల ఆర్ధికంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా కింద పన్ను రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికైనా దాన్ని ప్రకటించాలన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చి మూడేళ్లవుతున్నా అది ఇప్పటికీ అమల్లోకి రాలేదని బుగ్గన గుర్తుచేశారు. అమిత్ షా జోక్యంచేసుకుని దీన్ని అమల్లోకి తేవాలన్నారు. ఇరురాష్ట్రాల మధ్య ఆస్తులు,సంస్ధల విభజన త్వరగా పూర్తిచేయాలని కూడా బుగ్గన కోరారు. జాతీయస్ధాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇచ్చినా.. కేవలం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లు ఇచ్చి సరిపెట్టారని, ఇప్పటికైనా దానికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications