అప్పులపై ఇకనైనా దుష్ప్రచారం ఆపండి-యనమలకు బుగ్గన హితవు-2 లక్షల కోట్లు తగ్గించడంపై..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ తప్పులు, అప్పుల వల్లే రాష్ట్రానికి తిప్పలని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విడుదల చేసిన పత్రికా ప్రకటనపై బుగ్గన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గన.. యనమల గారూ! మీది కునుకు పాటా?'ఉనికి'కి పాట్లా? అని ప్రశ్నించారు. అప్పులపై మీ 'అంచనా'లు తలకిందులైనా మీ అసత్య ప్రచారం ఆపరా ? అని నిలదీశారు. ఎఫ్ఆర్బీఎం, కేంద్రం, కాగ్ లను మించి..ఆర్ధిక వ్యవస్థకు సంభంధం లేని వాళ్ళే టీడీపీ ఆస్థాన ఆర్థిక నిపుణులా ? అని అడిగారు. 2021-22 కాలంలో 15వ ఆర్ధిక సంఘం ద్రవ్యలోటు పరిమితిని 4.5% విధిస్తే, కోవిడ్ విధి వైపరీత్యంలోనూ వైసీపీ ప్రభుత్వం కేవలం 2.1 % మాత్రమే అప్పు చేశామన్నారు.
వైసీపీ సర్కార్ మొత్తం రూ. 1,85,000 కోట్లు డీబీటీ పద్దతిలో పారదర్శకంగా సాయం చేయగా, అందులో సుమారు రూ.1,35,000 కోట్లు (73%) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు లబ్ధిదారులుండడం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు. తమ ప్రభుత్వమున్నంత వరకూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఏ ఇబ్బంది లేదు..రాదన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు, ఆర్థిక నిర్వహణపై ప్రతిపక్షాలది పూటకో మాటని బుగ్గన ఆరోపించారు. ఏపీ అప్పులపై తెలుగుదేశం పార్టీ అధినేత, శాసన మండలి ప్రతిపక్షనేత, అధికార ప్రతినిధుల అయోమయం హాస్సాస్పదమన్నారు. అనుకూలమైన గణాంకాలు వాడడం, ప్రతికూలమైన వాటిని పక్కన పెట్టడంలో టీడీపీ దిట్ట అన్నారు. మీరు చేసిన తప్పులు, అప్పులు, పెట్టిపోయిన బకాయిల వల్లే కదా ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని తిప్పలు? మీ అప్పులు, వడ్డీలు కడుతూ అందిస్తోన్న ప్రజా సంక్షేమ ప్రవాహంపైనా మీ ఈర్ష?, ద్వేషం? తప్పుల మీద తప్పులతో అప్పుల ఊబిలో నిలువునా ముంచాకే కదా మా ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తుచేశారు.
25 ఏళ్ళ అనుభవం అంటూ యనమల గారు అసత్యాలు చెబుతుంటే, 40 ఏళ్ళ అనుభవమున్న చంద్రబాబు ఏపీ ప్రజలకు తన జోస్యాలతో తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని బుగ్గన విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2014 వరకు (1956-2014) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,20,556 కోట్లు కాగా, ఆ తర్వాత విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం తన ఐదేళ్ల వ్యవధిలో రూ.2,69,462 కోట్లు అప్పు చేసిందన్నారు. దీనర్థం 58 ఏళ్ల సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాల అప్పు కంటే మీ ఐదేళ్ల హయాంలో చేసిన అప్పు 124 శాతం పెరుగుదలా కాదా అని బుగ్గన ప్రశ్నించారు. అడ్డదిడ్డంగా మీరు అప్పులు చేసినా, వాటిని చక్కదిద్దుకుంటూ, పేరుకుపోయిన బకాయిలను మా ప్రభుత్వంలో కోవిడ్ విపత్తును ఎదుర్కొంటూనే బాధ్యతగా చెల్లిస్తూ మార్చి,2022 నాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ 3,82,165 కోట్లన్నారు. 2019 తో పోల్చితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పు కేవలం 42 శాతం పెరిగిందన్నారు.
యనమల గతంలో ప్రెస్ నోట్ (06-10-2022న)లో రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులంటూ రాసుకొచ్చారని, తాము ప్రెస్ మీట్లో అవగాహన కలిగించాక తాజాగా (25-12-2022న) విడుదల చేసిన ప్రెస్ నోట్లో రూ.6,38,000 కోట్ల అప్పు అంటున్నారని బుగ్గన గుర్తుచేశారు. ఒక్క ప్రెస్ మీట్ తో 2 లక్షల కోట్లు తగ్గించారని, ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మీకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తే అప్పుడైనా మీరు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వస్తారేమో అని సెటైర్లు వేశారు. మీ తప్పుల లెక్కలు, లెక్కతేలని అప్పుల విషయంలో ఇంకో ప్రెస్ మీట్ కల్లా మీరు కచ్చితంగా సెట్ అవుతారని భావిస్తున్నామన్నారు.