అరుణ్ జైట్లీతో యనమల భేటీ: అమిత్ షా డుమ్మా, కేంద్రం దిగొచ్చేనా?
ఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీతో టిడిపి, బిజెపి నేతలు సోమవారం నాడు రాత్రి పూట ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రెండు రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. మార్చి 5న, ఏపీకి నిదుల కేటాయింపు అంశంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. కానీ, ఈ సమావేశానికి మాత్రం అమిత్షా గైరాజరయ్యారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిదుల కేటాయింపు విషయంలో న్యాయం జరగలేదని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి కూడ బిజెపి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది.మిత్రుల మధ్య అగాధం ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తోంది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో అమీ తుమీ తేల్చుకోవాలని టిడిపి కూడ నిర్ణయం తీసుకొంది. ఈ తరుణంలోనే మరోసారి టిడిపి, బిజెపి నేతల మధ్య సోమవారం నాడు సమావేశమయ్యారు.
టిడిపి, బిజెపి నేతల సమావేశానికి అమిత్ షా గైరాజర్
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మెన్ కుటుంబరావు, టిడిపి ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కింజారపు ఎర్రన్నాయుడులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడ పాల్గొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా సూచన మేరకే ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ, ఈ సమావేశానికి అమిత్ షా గైరాజరయ్యారు.
విభజన హమీలు, ప్రత్యేక హోదాపై చర్చ
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిదులు , ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర విభజనతో ఏపీ ఆర్థికంగా చతికిలపడిపోయిందని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రం నుండి పెద్ద మొత్తంలో సహయం అందించకపోతే రాష్ట్రం ముందుకు సాగే పరిస్థితులు ఉండవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఏపీకి వాటాలను ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
ప్రత్యేక హోదాపై చర్చ
ప్రత్యేక హోదాపై కూడ చర్చ జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం టిడిపి వర్గాల నుండి విన్పిస్తోంది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీలో ప్రకటించిన అంశాలను కూడ అమలు చేయలేదని టిడిపి అసంతృప్తితో ఉంది. దీంతో ప్రత్యేక హోదాను ఇవ్వాలని టిడిపి వాదిస్తోంది.ఈ అంశాన్ని కూడ ప్రస్తావించే అవకాశం ఉంది.ప్రత్యేక హోదాను తాము ఏనాడు వ్యతిరేకించలేదని కూడ టిడిపి నేతలు గుర్తుచేస్తున్నారు.
ఏపీకి న్యాయం జరిగేనా
ఏపీ రాష్ట్రానికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిదులు ఇచ్చామని బిజెపి నేతలు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన హమీల్లో 85 శాతం హమీలను నెరవేర్చామని బిజెపి నేతలు ప్రకటించారు. అయితే రెండు పార్టీల నేతల మాటల యద్దం సాగుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఏపీకి న్యాయం జరిగేనా అనే ఉత్కంఠ నెలకొంది.