అలా రూ.వేల కోట్లు నిధుల స్వాహా..ఎపి ప్రభుత్వంపై మాజీ సిఎస్ అజేయ కల్లం ఆరోపణలు
తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఛీప్ సెక్రటరీ అజేయ కల్లం మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని..ఎపి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన వేలాది కోట్ల రూపాయల నిధులను ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
జన చైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అనే సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ సిఎస్ అజేయ కల్లంతో పాటు సమాచార హక్కు మాజీ కమీషనర్ విజయబాబు,మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదిదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సిఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ కేంద్రం ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.20వేల కోట్లు ఇస్తే అందులో కనీసం మూడోవంతు నిధులు స్వాహా అయినట్లు ఆరోపించారు.
రూ.వేల కోట్లు...స్వాహా ఇలా
ఎపి ప్రభుత్వం ఏ విధంగా నిధులను దుర్వినియోగం చేసిందో సోదాహరణంగా వివరించారు. మార్కెట్లో రూ.4 వేలు విలువచేసే సెల్ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు రూ.7,500 చొప్పున 5 లక్షల ఫోన్లు కొనుగోలు చేశారని, తద్వారా ఈ ఒక్క కార్యక్రమంలోనే రూ.150 కోట్లు స్వాహా చేయడం జరిగిందన్నారు. ఇక ఐటి కంపెనీల పేరుతో రూ.450 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.45 లక్షలకే ధారాదత్తం చేశారని ఆయన వివరించారు.
ప్రభుత్వం...వారికి దోచిపెడుతోంది
అలాగే గడచిన నాలుగేళ్లలో ఒక మీడియా సంస్థకు ఎపి ప్రభుత్వం ఏకంగా రూ.700 కోట్లు చెల్లించడాన్ని అజయ్ కల్లం తప్పుబట్టారు. రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11వేలు చెల్లించినా చిన్నపాటి వర్షానికే కారుతోందని అజేయ కల్లం గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు తమ ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లభించక అప్పులపాలవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ వ్యాపారులకు దోచిపెడుతోందని ఆయన ఆరోపించారు.
ప్రజలు...ఆలోచించాలి
ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన వేల కోట్ల రూపాయల నిధులను స్వీయ ప్రచారం కోసం ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష, పుష్కరాలు, క్యాంప్ కార్యాలయాలు, ప్రత్యేక విమానాలు, విదేశీయాత్రల పేరుతో పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని చెప్పారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం సిఎం చంద్రబాబు ఖర్చుచేస్తున్నట్లు అజేయ కల్లం వెల్లడించారు. మరోవైపు గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు అంటూ ఎపి ప్రభుత్వం మరిన్ని అప్పులు చేస్తోందని, వాటిని ఎందుకూ ప్రయోజనంలేని రంగాలకు వెచ్చిస్తోందన్నారు. ఎపిలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని...ప్రజలందరిలో ప్రశ్నించే తత్వం పెరగాలని అజేయ కల్లం ఆకాంక్షించారు.
ఆ ఘనత...ఎపికే దక్కింది
అనంతరం సమాచార హక్కు మాజీ కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. అంతేకాకుండా స్పీకర్ స్థానంలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సభాపతి కూడా ఫిరాయింపుదారులకు మద్దతుగా నిలవటం దురదృష్టకరమని అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ కే దక్కిందని విజయ్ బాబు ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలు లక్షల్లో...భర్తీ వేలల్లో
అనంతరం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్రావు మాట్లాడుతూ ఎపిలో గత నాలుగున్నర సంవత్సరాల్లో 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా కేవలం 5 వేలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 6వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. చివరగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఏపీలో సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్య, వైద్య రంగాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలోనే 27వ స్థానం, అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉంటే.. అవినీతిలో మాత్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు రాజకీయ అవినీతి కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు.