జగన్ కు వ్రతం చెడినా ఫలితం దక్కట్లేదా ? మధ్యంతరమే గతి ! మాజీ సీఎస్ అంచనా !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో చివరి ఏడాది కూడా సంక్షేమ పథకాలను మరిన్ని అప్పులు తెచ్చయినా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే అప్పులకు అన్ని దారులు మూసుకుపోవడంతో భూముల తాకట్టుకు సిద్ధమవుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
ఐవైఆర్ సంచలన ట్వీట్
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సీఎస్ గా పనిచేసి అనంతరం బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు చివరికి అదే చంద్రబాబుతో విభేదించి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత టీడీపీతో పాటు వైసీపీని సైతం ఆయన తన విమర్శలతో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో ఏం జరుగుతోందో అణువణువూ తెలిసిన ఐవైఆర్.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై వాస్తవాలతో చేస్తున్న విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరో సంచలనం రేపారు.
జగన్ కు వ్రతం చెడినా దక్కని ఫలితం ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తాజా ఆర్ధిక పరిస్దితిపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో రాష్ట్రంలో ఆర్ధిక పరిస్దితిని రెండు ముక్కల్లో తేల్చిచెప్పేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమం కోసం చేస్తున్న అప్పులపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంత చేస్తున్నా జగన్ కు ఫలితం దక్కడం లేదన్నారు. జగన్ కు వ్రతం చెడినా ఫలితం దక్కేలా లేదని మాజీ సీఎస్ ఐవైఆర్ విశ్లేషించారు. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా ఆయన ఏకరువు పెట్టారు.
తాకట్టు పెట్టినా రుణాలు పుట్టేలా లేవు
రాష్ట్రంలో అప్పులకు దారులు మూసుకుపోయినట్లు ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్ లో పరోక్షంగా వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలో భూముల తాకట్టుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. ఈనాడు పత్రికలో 'ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే భూముల తాకట్టా' పేరుతో వచ్చిన కథనాన్ని ఆయన ట్వీట్ కు తగిలించారు. అన్నీ తాకట్టు పెట్టినా రుణాలు పుట్టేటట్టుగా లేవంటూ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఇంకా ఒకటిన్నర సంవత్సరం నెట్టాలన్నారు. తద్వారా ఆలోపు రుణాలు పుట్టకపోతే పరిస్ధితి ఏంటన్న ప్రశ్నసంధించారు.
మధ్యంతరమే గతా ?
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో ఎలాచూసినా రుణాలు పుట్టడం లేదని, భూముల తాకట్టుకు సిద్ధమవుతున్నారని, అయినా ఏడాదిన్నర నెట్టుకొచ్చే పరిస్దితి లేదని ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్ లో విశ్లేషించారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికలే గతేమో అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. తద్వారా జగన్ కాస్త బయటపడే అవకాశం ఉన్నట్లు ఐవైఆర్ పరోక్షంగా వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికలపై చంద్రబాబు సహా విపక్షాలు వేస్తున్న అంచనాలను ఆయన సమర్దించినట్లయింది.
గత సీఎంలకు ఆ తెలివే ఉంటే ?
ప్రస్తుతం సీఎం జగన్ అప్పుల కోసం భూముల తాకట్టుకు కూడా సిద్దమైపోతున్నారని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులకు ఆమాత్రం తెలివిలేకపోయిందని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. వారికి ఆ తెలివితేటలే ఉండి ఉంటే ఇప్పుడు తాకట్టు పెట్టడానికి ఏమీ మిగిలి ఉండేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. తద్వారా వారు చేయని భూముల తాకట్టు వంటి పనుల్ని సీఎం జగన్ చేస్తున్నారని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. దీంతో ఐవైఆర్ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.