పీఆర్సీపై జగన్ సర్కార్ వేగంగా అడుగులు-ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
ఏపీలో ఉద్యోగసంఘాలు కోరుతున్న పీఆర్సీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు నిన్న సీఎం జగన్ కు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ నివేదికను అందజేసింది. దీంతో పాటు నివేదికను ఆర్ధిక శాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ఉద్యోగులకు ఈసారి 14.29 శాతం ఫిట్ మెంట్ ను సిఫార్సు చేశారు. దీనిపై ఉద్యోగులతో చర్చించనున్నారు.
పీఆర్సీ నివేదికను నిన్న బహిర్గతం చేసిన ప్రభుత్వం.. సాధ్యమైనంత త్వరగా దీనిపై ఉద్యోగులతో చర్చించి తుది రిపోర్ట్ ను ఖరారు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎస్ సమీర్ శర్మ 72 గంటల్లో సీఎం జగన్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఉధ్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల్ని చర్చలకు ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ఫిట్ మెంట్ లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు నిన్న విడుదలైన పీఆర్సీనివేదికపై గుర్రుగా ఉన్నాయి. తాము 46 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ వస్తుందని ఆశించగా.. ప్రభుత్వం కేవలం 14.29 శాతం మాత్రమే సిఫార్సు చేయడం, అలాగే ఇకపై పీఆర్సీలు ఉండవని ప్రకటించడం, కేంద్ర పీఆర్సీతో సమానంగా మాత్రమే పీఆర్సీ పెంపు ఇస్తామని చెప్పడంపై ఉద్యోగులు భగ్గుమన్నారు. దీంతో ఇవాళ సలహాదారు సజ్జలతో జరిగే భేటీలో వారు ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. అసలే ప్రభుత్వంతో పాటు అందులో భాగమైన ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు పీఆర్సీ రూపంలో తమకు లబ్ది కలుగుతందని వారు గంపెడాశలు పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఉద్యోగులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వాస్తవానికి పీఆర్సీ నివేదిక నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని, మొత్తం 71 డిమాండ్లపై చర్చిస్తేనే వస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. కానీ ఇక్కడ సజ్జల జోక్యంతో ఇవాళ చర్చలకు వారు వస్తున్నట్లు తెలుస్తోంది. 72 గంటల్లో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని సీఎస్ చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.