ఫ్రంట్లైన్ వర్కర్లకు ఏపీ సర్కార్ భరోసా- 10 నుంచి 25 లక్షలు-గరీబ్ కళ్యాణ్కు అదనం
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఫ్రంట్లైన్ వర్కర్లకు సైతం చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటించకపోడంతో జూనియర్ వైద్యులు తాజాగా సమ్మె కూడా చేపట్టారు. సమ్మె సందర్భంగా జరిపిన చర్చల్లో అంగీకారం మేరకు ప్రభుత్వం ఇవాళ వారికి ఎక్స్గ్రేషియాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కరోనాతో డాక్టర్లు కానీ, ఇతర వైద్యసిబ్బంది కానీ చనిపోయిన సందర్భాల్లో ఇవ్వాల్సిన పరిహారాలను వైద్య ఆరోగ్యశాఖ జీవో ద్వారా వెల్లడించింది. ఇందులో కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్ఎస్ఓ లేదా ఎమ్ఎస్ఓలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పరిహారాల్ని మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందజేస్తుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనాతో చనిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ప్రకటించిన పరిహారాలు దీనికి అదనంగా ఇవ్వనున్నారు. తద్వారా కోవిడ్తో చనిపోయిన ఫ్రంట్లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు రెండు విధాలుగా పరిహారం దక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.