తెలంగాణా బాటలో ఏపీ మరో కీలక నిర్ణయం: అవినీతి సర్పంచ్ లకు గడ్డు కాలం
ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలను ప్రక్షాళన చెయ్యటమే కాదు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణాలో పంచాయితీల పని తీరు విషయంలో అమలు చేస్తున్న నిర్ణయాలను తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు సమాచారం. సర్పంచ్ ల అధికారాలు విధుల విషయం లో తెలంగాణాలో సీఎం కేసీఆర్ చాలా కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక ఈ విధానమే ఇప్పుడు ఏపీలో కూడా అమలు చెయ్యనున్నారు.
పంచాయితీ రాజ్ చట్టంలో కీలక మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
పంచాయితీ రాజ్ చట్టాన్ని మరింత కఠినతరం చెయ్యటానికి సిద్ధం అయ్యింది ఏపీ ప్రభుత్వం . ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసింది. ఆ చట్టాన్ని మరింత కఠినం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ లు అవినీతికి పాల్పడకుండా, అందరూ పారదర్శకంగా పని చేసేలా ఈ చట్టానికి రూపకల్పన చేశారు.
నిబంధనలు పాటించకున్నా, అవినీతికి పాల్పడినా ఉద్వాసనే
పంచాయతీ రాజ్ చట్టంలో నియమ నిబంధనలు పాటించక పోయినా అవినీతికి పాల్పడినా సర్పంచ్ లకు ఇక వారు పదవులు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఈ చట్టలో చేస్తున్న మార్పుల వలన కలగానుననాయి. దీంతో అవినీతి సర్పంచ్ లకు చెమటలు పట్టే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించటంతో పాటు ఎవరైనా డబ్బు మద్యం పంచినట్లు గుర్తిస్తే అనర్హత వేటు వేయనున్నారు.
పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్
ఇక పంచాయితీ ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేందుకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చింది. అంతే కాదు గ్రామాలలో పరిపాలన కూడా సవ్యంగా సాగేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించకపోయినా, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా బాధ్యులైన సర్పంచ్, ఉప సర్పంచ్ లను తొలగించేలా నిబంధనలు తెచ్చారు.ఇప్పటివరకు కీలక విషయాల్లో గ్రామసభలు నిర్వహించకుండానే సర్పంచ్ లు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
Recommended Video
పలు నిబంధనలతో అవినీతి సర్పంచ్ లకు చుక్కలు
ఈ నేపధ్యంలో తనకిచ్చిన అధికారాలు దుర్వినియోగం చేసినా, నిధులు గ్రామాభివృద్ధికి కాకుండా సొంతంగా వాడుకున్నా చర్యలు తీసుకోనున్నారు. ఇక కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయకపోయినా పదవి నుంచి తొలగించే అధికారం కలెక్టర్ కు అప్పగించారు. వీటితో పాటు పంచాయతీ పరిధిలోనే నివసించాలని , రోజూ పంచాయతీ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. ఇక ఎవరైనా, ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పిదాలపై వివరణ ఇచ్చే అవకాశం కల్పించి ఉద్వాసన పలికేందుకు కలెక్టర్లకు అధికారం ఇవ్వాలని పేర్కొన్నారు.