త్వరలో "అమరావతి యాత్రలు" ప్రారంభం:రాష్ట్ర ప్రజలు రాజధాని నగరం సందర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు
Recommended Video

అమరావతి:నవ్యాంధ్ర రాజధాని నగరం నిర్మాణం విషయమై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలు తొలగించేందుకు అధికార పార్టీ టిడిపి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ప్రజలను పోలవరం వద్దకు తీసుకెళ్లి ప్రాజెక్ట్ పనుల పురోగతి చూపించే "పోలవరం యాత్రలు" తరహాలో రాష్ట్ర వాసుల కోసం ఎపి ప్రభుత్వం "అమరావతి యాత్రలు" చేపట్టనుంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమానికి నాంది పలకాలని ఎపి గవర్నమెంట్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం గురించి రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసుకోవాలని టిడిపి ప్రభుత్వం భావిస్తోంది.

పోలవరం యాత్రలు...అదే తరహాలో...
పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు,నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రజలంతా చూసి, ఆ భారీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో "పోలవరం యాత్రలు"కు తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రల ద్వారా ఆ భారీ జలాశయ నిర్మాణ విశేషాలు, వేలాది కార్మికుల నిరంతర శ్రమ, భారీ, అధునాతన యంత్రాలతో అక్కడ జరుగుతున్న పనుల ప్రజలకు అవగాహన కలిగించాలని ఎపి ప్రభుత్వం ఉద్దేశం. ఆ ప్రాజెక్ట్ వీక్షణ న అనంతరం సందర్శకులు చెబుతున్న అభిప్రాయాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం నెరవేరినట్లు స్పష్టమవుతోంది.

అలాగే..."అమరావతి యాత్రలు"
తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా, ఆదునిక పద్దతుల్లో నిర్మిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచస్థాయి నగరం విశిష్టతల గురించి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ‘అమరావతి యాత్రలు'కు శ్రీకారం చుట్టాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించినప్పటికీ అనేక అభివృద్ధి పనులు అప్పటికి ఇంకా ఒక నిర్దిష్ట రూపం సంతరించుకోనందున ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. అయితే తొలిదశ పనుల్లో భాగమైన ప్రధాన రహదారులు, గవర్నమెంట్ కాంప్లెక్స్లోని మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల పనులు ఇప్పటికి ఒక రూపు సంతరించుకోవడంతో ‘అమరావతి యాత్రలు'కు ప్రభుత్వం పచ్చజెండా ఊపాలని నిర్ణయించింది.

ప్రారంభం నాటికి...ఇవి కూడా
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సిటీ నిర్మాణంలోని అంతర్భాగమైన అనేక పనుల నిర్మాణం ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంది. అలాగే నూతన రాజధానికి వరద ముప్పును తప్పించేందుకు ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల పథకం కూడా యాత్రల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి రూపు తీసుకోనున్నట్లు తెలిసింది. అలాగే హైకోర్టు శాశ్వత భవనం సిద్ధమయ్యే వరకు దాని కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్మిస్తున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్, శాశ్వత సెక్రటేరియట్ పనులు కూడా అప్పటికి వేగం పుంజుకోనున్నాయి. దీంతో ‘అమరావతి యాత్రలు'కు వచ్చే నెలలో శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

దుర్గమ్మ దర్శనంతో...యాత్ర ఆరంభం...
ఎపి ప్రభుత్వం ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి "అమరావతి యాత్రలు"కు ఆసక్తి చూపే ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి తొలుత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనకదుర్గమ్మ దర్శనం చేయిస్తారని తెలిసింది. అనంతరం వారిని అమరావతికి తీసుకెళ్లి కొండవీటి వాగుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం, సువిశాల సీడ్ యాక్సెస్ రహదారి, వివిధ ప్రాధాన్య రహదారులు, గవర్నమెంట్ కాంప్లెక్స్లోని గృహ సముదాయాలు, ఇతర నిర్మాణాలు చూపిస్తారని సమాచారం. అలాగే వెలగపూడిలో రికార్డు సమయంలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం, ఇప్పటికే క్లాసులు ప్రారంభమైన ఎస్ఆర్ఎం, విట్ క్యాంపస్ లను సైతం సందర్శన చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సందర్శకుల వెంట ఉండే ఏపీసీఆర్డీయే అధికారులు ఆయా ప్రదేశాల గురించి వారికి తెలియజేయడంతోపాటు మాస్టర్ ప్లాన్లోని పలు విశేషాలు కూడా వివరిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications