మళ్లీ తెరపైకి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసు-జగన్, కేసీఆర్పై కేసులు- కొత్త సిట్ ఛీఫ్..
2015లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఓటుకు నోటు కేసుకు కౌంటర్గా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసును తవ్వితీసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. అప్పటి సీఎం చంద్రబాబు ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ట్యాప్ చేశాయని ఆరోపిస్తూ ఏపీ వ్యాప్తంగా కేసులు పెట్టారు. వీటన్నంటినీ కలిపి విచారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ నత్తనడకన దర్యాప్తు సాగిస్తుండగా.. దాని అధిపతి రిటైర్ అయి వెళ్లిపోయారు. ఆ తర్వాత మూలనపడ్డ ఈ కేసును జగన్ సర్కార్ మరోసారి తెరపైకి తీసుకురావడం వెనుక ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్కు కొత్త ఛీఫ్ను నియమించడం ద్వారా జగన్ ఆశిస్తున్నదేంటి అన్న దానిపై చర్చ మొదలైంది.

ఓటుకు నోటుకు కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్...
2015లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచే పాలన సాగించేవారు. ఏపీలో రాజధాని నిర్మాణం కాకపోవడం, కేంద్రం పదేళ్లపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం వంటి కారణాలతో ఆయన నగరంలోని లేక్వ్యూ గెస్ట్హౌస్ నుంచే పాలన సాగించారు. అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడం, ఇందులో టీడీపీ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం పార్టీ నేత రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను 50 లక్షలు తీసుకెళ్లి ప్రలోభపెట్టడం, మొత్తం డీల్ ఐదు కోట్లుగా తేలడంతో ఈ వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. అయితే ఇందులో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న వాయిస్తో స్టీఫెన్సన్కు తమకు అనుకూలంగా ఓటేస్తే అంతా తాను చూసుకుంటానంటూ ఓ గొంతు వినిపించడం ఈ మొత్తం వ్యవహారానికి కీలకంగా మారింది. దీంతో ఈ గొంతు చంద్రబాబుదా కాదా అనే చర్చ మొదలైంది. చివరికి ఆ గొంతు తనది కాదని చెప్పకుండానే చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ తన ప్రభత్వంలోని పోలీసులతో కౌంటర్ కేసు నమోదు చేయించారు.

కేసీఆర్, జగన్ టార్గెట్గా సిట్ ఏర్పాటు..
హైదరాబాద్లో తన ఫోన్ ట్యాపింగ్కు తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఏపీ విపక్ష నేత జగన్, తెలంగాణ ఏసీబీ అధికారులు, అక్కడి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కారణమంటూ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నమోదైన 88 కేసులను కలిపి దర్యాప్తు చేసేందుకు వీలుగా చంద్రబాబు ప్రభుత్వం 2015 జూన్లో సిట్ ఏర్పాటు చేసింది. అప్పటి ఐపీఎస్ మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ వ్యవహారాన్ని ఎటూ తేల్చలేకపోయింది. రాజకీయ ఒత్తిళ్లు, పొరుగు రాష్ట్ర అధికార పార్టీ పెద్దలు ఇందులో ఉండటంతో సిట్ తన పని స్వేచ్ఛగా చేయలేకపోయింది. 2018 వరకూ ఇదే తంతు సాగింది. చివరికి 2018లో ఇక్బాల్ పదవీ విరమణ చేసి వెళ్లిపోయారు. సిట్ దర్యాప్తు కూడా మూలనపడింది. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఇక్బాల్ స్ధానంలో మరో కొత్త అధికారిని నియమించకపోగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా దీన్ని పట్టించుకోలేదు.

రాజకీయ సెటిల్మెంట్గా ప్రచారం..
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కేసీఆర్ తెలివిగా ఇరికించగా.. దానికి కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. దీంతో ఇరువురూ డిఫెన్స్లో పడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు కానీ ముందుకు వెళ్లలేని పరిస్ధితి తలెత్తింది. దీంతో ఈ రెండు కేసుల్లోనూ వీరిద్దరూ ముందుకు వెళ్లకుండా ఓ అనధికార రాజకీయ సెటిల్మెంట్ జరిగిందనే ప్రచారం కూడా ఉంది. అప్పట్లో కేంద్రంలోని కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఈ రెండు వ్యవహారాలను ముందుకెళ్లకుండా ఆపేశారని, దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా సామరస్యంగా ఉన్నట్లు చెప్పుకుంటూ కేసుల దర్యాప్తును లైట్ తీసుకున్నారని చెబుతారు. అందుకే సిట్ అధిపతి రిటైర్ అయినా కొత్త బాస్ రాకపోవడం, అటు ఓటుకు నోటు కేసులోనూ తెలంగాణ ఏసీబీ దర్యాప్తు ముందుకు సాగకపోవడాన్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.

ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి తెచ్చిన జగన్
చంద్రబాబును నిందితుడిగా పేర్కొన్న ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందో ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్కు కౌంటర్గా చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులను మాత్రం జగన్ సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చింది. రిటైరైన సిట్ అధిపతి ఇక్బాల్ స్ధానంలో ప్రస్తుతం శాంతిభద్రతల డీఐజీగా ఉన్న రాజశేఖర్బాబును నియమించింది. సెప్టెంబర్ 3న డీజీపీ గౌతం సవాంగ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ కేసు దర్యాప్తు ఇక్బాల్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి తిరిగి మొదలు పెట్టడం ఖాయమే. అయితే ఈసారి ప్రభుత్వాలు మారాయి, ప్రయారిటీలు మారాయి కాబట్టి ఇందులో ఎవరెవరు నిందితులు కాబోతున్నారు, మరెవరికి ఊరట దక్కబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Recommended Video

సుప్రీం ఆదేశాలే కారణమా ?
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులపై ఏడాదిలోపు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేయాలని, లేదా వాటిలో సరైన సాక్ష్యాధారాలు లేకపోతే కేసులు ముగించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల హైకోర్టులు కూడా కార్యాచరణ ఖరారు చేశాయి. ఇందులో భాగంగానే సిట్కు కొత్త బాస్ ను నియమించి ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు అసలు ఈ కేసుకు కారణమైన ఓటుకు నోటు కేసును కూడా తెలంగాణ ప్రభుత్వం తవ్వాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మరోసారి ప్రకంపనలు ఖాయం. అయితే ఈ రెండు కేసుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు, ఏపీ ప్రతిపక్ష నేత కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో కేసులు ఏ మలుపు తీసుకోబోతున్నాయనే ఆసక్తి పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్లో ప్రస్తుత మార్పు ప్రకారం జగన్ను నిందితుడిగా తొలగించే అవకాశాలూ లేకపోలేదు. అయితే కేసీఆర్ను కూడా ఈ కేసు నుంచి తప్పిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే అసలు చంద్రబాబు ఫోన్లను ట్యాప్ చేశారని నేరుగా ఆరోపణలు చేసిందే కేసీఆర్పైన. కేసీఆర్తో జగన్ తాజా జల జగడాల నేపథ్యంలో కేసీఆర్పై ఈ కేసు కొనసాగడమా లేక కొట్టేయడమా అనేది కూడా జగన్ సర్కారు చేతుల్లోనే ఉంది.
2015 మేలో తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు
దాని వెంటే ఫోన్ ట్యాపింగ్ కేసు
ఏపీకి తరలివచ్చిన చంద్రబాబు
తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ కేసీఆర్,జగన్, నాయిని నర్సింహారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్, తెలంగాణ ఏసీబీ అధివీలుగకారులు, టీ న్యూస్, సాక్షి ఛానళ్లపై ఏపీలోని పలు జిలాల్లో మొత్తం 88 కేసులు నమోదు చేశారు.
2015 జూన్ 17న సిట్ ఏర్పాటు
2018లో రిటైర్ అయిన సిట్ ఛీఫ్ ఇక్బాల్












Click it and Unblock the Notifications