TDP: మహానాడుకు RTC బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం??
తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయంటూ కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. బస్సులు కావాలని అడిగితే అధికారులు ముందు సరే అంటున్నారని, ఆ తర్వాత వేసవికాలం కాబట్టి రద్దీ ఉంటుందని, బస్సులు ఇవ్వలేమంటున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు.

మంత్రుల బహిరంగ సభల కోసం బస్సులు?
అధికారులు చెప్పేవన్నీ సాకులేనని, ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా జరిగే బహిరంగ సభలకు ఈ బస్సులను తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుపై ప్రజల దృష్టి పడకుండా అడ్డుకునేందుకే మంత్రుల బస్సు యాత్ర కార్యక్రమం వైసీపీ చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 26వ తేదీన శ్రీకాకుళం, 27వ తేదీన రాజమండ్రి, 28వ తేదీన నరసరావుపేట, 29వ తేదీన అనంతపురంలో బహిరంగ సభలు జగరనున్నాయి.

ప్రయివేటు పాఠశాలల బస్సులు కూడా
ఈ బహిరంగ సభలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను పెద్ద సంఖ్యలో సమకూరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. బహిరంగ సభలకు ఎన్ని బస్సులు కావాలనే విషయమై అధికార పార్టీ నేతలు ఇప్పటికే రవాణాశాఖ అధికారులకు సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది.

ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి
పాఠశాలలకు, కళాశాలలకు ప్రస్తుతం వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి అవి తెరిచేలోగా ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులన్నీ ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. అయితే వీటితో సంబంధం లేకుండా, ఫిట్ నెస్ లేకపోయినా కొన్ని బస్సులను మంత్రుల బహిరంగ సభలకు సమకూరుస్తున్నారని, ఒకవేళ అవే బస్సులను తమ మహానాడుకు తీసుకువెళితే వాటిపై ఫిట్ నెస్ కేసులు పెడతామని రవాణాశాఖ అధికారులు ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు.

ఫ్లెక్సీలకు నో
తెలుగుదేశం పార్టీ మహానాడును పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల వరకు ఎక్కడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడంలేదని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామెప్పుడూ ఇలా వ్యవహరించలేదని టీడీపీ నేతలు అంటున్నారు.












Click it and Unblock the Notifications