సినిమా టికెట్ల రేట్లపై కమిటీ రెండోసారి భేటీ-పెంపుకు ప్రతిపాదనలు-మరో భేటీలో ఫైనల్
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కమిటీ సభ్యులు.. ఇవాళ మాత్రం సచివాలయంలో నేరుగా భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరలపై తమ ప్రతిపాదనల్ని సభ్యులు కమిటీకి సమర్పించారు.
ఏపీలో సినిమా టికెట్ల దరల నిర్దారణ కోసం నియమించిన కమిటీ హోంశాఖ కార్యదర్శి విజయ్ కుమార్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయింది. ఇందులో టికెట్ల ధరలకు సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఇందులో ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. సమావేశం అనంతరం బయటికి వచ్చిన కమిటీ సభ్యులు మీడియాతో ఆ విషయాల్ని వెల్లడించారు.
టికెట్ రేట్లపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు కమిటీ సభ్యుడు ముత్యాల రాందాస్ తెలిపారు. బి,సి సెంటర్లలో రేట్లను మార్పు చేయాల్సి ఉందన్నారు. థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపైనా కమిటీ చర్చించినట్లు ఆయన తెలిపారు. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించాలని ప్రతిపాదన ఇచ్చినట్లు ప్రేక్షకుల సంఘం తరఫున సభ్యురాలిగా ఉన్న గంపా లక్ష్మీ వెల్లడించారు. ఫుడ్ అధిక రేట్లకు అమ్మడం, టాయిలెట్స్ సరిగా లేకపోవడం కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.
నగర పంచాయతీల్లో ధరలు కొంచెం పెంచాలని ఆమె సూచించారు. మరోవైపు టికెట్ రేట్లు పెంచాలని కమిటీకి సూచించినట్లు ఎగ్జిబిటర్ వేమూరి బలరత్నం తెలిపారు. రేట్ల తగ్గింపుతో థియేటర్లు ఇబ్బందులు పడుతున్నాయని, 200 కు పైగా థియేటర్లు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
మరోసారి భేటీ కావాలని నిర్ణయించిన కమిటీ... ఇందులో వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించనుంది. ఈ భేటీలోనే తుది నిర్ణయం ఉండే అవకాశముంది. ఈ సిఫార్సుల్ని వచ్చే నెలలో హైకోర్టుకు ప్రభుత్వం అందజేయనుంది. దాని ఆధారంగా తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.