సచివాలయాల్లో 14,493 పోస్టుల భర్తీ- ఎప్పుడంటే : ఆ సమయంలో విధులు తప్పనిసరి చేస్తూ..!!
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ.. సమ్మె వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ పైన ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ దీని పైన స్పష్టమైన ప్రకటన చేసారు. జూన్ నెలాఖరు నాటికి ప్రోబేషన్ ఖరారు చేస్తామని వెల్లడించారు. ఇక, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచటంతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ పైన అనుమానాలు మొదలయ్యాయి. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా వార్డు - గ్రామ సచివాయాల్లో ఉద్యోగాల నియామకం చేపట్టింది.
కొత్తగా 14,493 ఉద్యోగాల భర్తీ
ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు సచివాలయాల్లో పని చేసి.. అర్హత సాధించిన ఉద్యోగులకు జూన్ చివరి నాటికి ప్రొబేషనరీ పూర్తి చేయటంతో..పాటు ఖాళీల భర్తీ పైన ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయి.
అందులో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. దీంతో..ఇదే అంశం పైన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేసారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ రెండు గంటలు కార్యాలయాల్లో తప్పనిసరి
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ను ఆదేశించారు.
తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఏ సచివాలయం నుంచి అయినా పలు సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ఇప్పటికే 14,493 ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియపైన నిర్ణయం జరిగిందని..త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని స్పష్టం చేసారు.
ప్రొబేషన్ ప్రకటన.. కొత్త జిల్లాల్లో
ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు. జూన్ మాసాంతానికి సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయటం ద్వారా..కొత్తగా పిలిచే ఉద్యోగాలకు డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, వీటి భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉండాలి... నియామక బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దాని పైన ప్రభుత్వంలో కసరత్తు జరుగుతోంది.
ఉగాది లోగా దీనికి సంబంధించి నియామక నోటిఫికేషన్ విడుదల - భర్తీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. కొత్త జిల్లాలు అధికారికంగా అందుబాటులోకి వచ్చే సమయానికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ప్రభుత్వ నిర్ణయం కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు.