ల్యాండ్ పూలింగ్ ద్వారానే, అక్కడే రాజధాని
హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూసేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మంత్రి నారాయణ తదితరులు విలేకరులతో మాట్లాడారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూసేకరణ జరపాలని తాము నిర్ణయించామని చెప్పారు. వచ్చే నెల ఆరో తారీఖున ల్యాండ్ పూలింగ్ పైన సబ్ కమిటీ భేటీ అవుతుందని తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమీకరించి.. రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన దాని కంటే ఏపీలో పదిశాతం ఎక్కువగా ఇస్తామని చెప్పారు. భూమిని ఇచ్చిన వెంటనే రైతులు ఎవరైతే అమ్ముకోకుండా ఉంటారో వారికే ఇస్తామని తెలిపారు.
గాంధీ నగర్లో అభివృద్ధి చేసిన దాంట్లో 25 శాతం ఇచ్చారని, నయా రాయపూర్లో 35 శాతం ఇచ్చారని నారాయణ తెలిపారు. ఏపీలో పది శాతం ఎక్కువగానే ఇస్తామన్నారు. అభివృద్ధి చేసిన భూమిలో ఎంత శాతం వాటా ఇవ్వాలనే దాని పైన తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు.
ఆరు నెలల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేస్తామని చెప్పారు. విడతల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్కో విడతలో 25వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. అగిరిపల్లె అటవీ భూముల్లో పెద్ద ఎత్తున కొండలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారని నారాయణ తెలిపారు.
కాగా, విజయవాడ-గుంటూరు-మంగళగిరి ప్రాంతాల్లోనే రాజధాని ఉంటుందని తెలుస్తోంది. నయా రాయపూర్ తరహా రాజధాని వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. భూసేకరణకు ఎకరాకు రూ.73 లక్షల నుండి రూ.90 లక్షల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
రుణమాఫీపై...
రుణమాఫీ చేస్తామని నారాయణ చెప్పారు. నిన్న ఆర్థిక వనరుల కమిటీ ఈ విషయమై భేటీ అయిందని, తిరిగి సోమవారం బ్యాంకర్లతో సమావేశమవుతుందని తెలిపారు. రైతులు చెల్లించని రుణాలను మొండి బకాయిలుగా పరిగణించవద్దని తాము కోరుతామన్నారు. రుణమాఫీపై తగ్గేది లేదని చెప్పారు.