తొలిసారి ఏపీలో దిశ ఎఫెక్ట్-రమ్య హంతకుడికి 257 రోజుల్లో ఉరి-సర్కార్ తల్చుకుంటే..
ఏపీలోని గుంటూరులో గతేడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ఇవాళ నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడింది. గుంటూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్ధానం అతి తక్కువ సమయలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. ఈ కేసులో పోలీసులతో పాటు న్యాయస్ధానం కూడా అత్యంత వేగంగా, చిత్తశుద్ధితో పనిచేసి ఉన్మాది శశికృష్ణకు ఉరిపడేలా చేశారు. అయితే ఇందుకు మరో ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ.దిశ చట్టంతోనే తమ కుమార్తెకు న్యాయం జరిగిందని ఇవాళ రమ్య తల్లితండ్రులు గర్వంగా చెప్పారు.
గతేడాది ఆగస్టు 15న రమ్యను నిందితుడు శశికృష్ణ గుంటూరు నగరంలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేసిన తర్వాత దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశ పోలీసు స్టేషన్, పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కేవలం 10 గంటల వ్యవధిలోనే అతన్ని అరెస్టు చేశారు. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ ఆధారాల్ని నిర్ధారణ చేశారు. దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు కూడా వచ్చాయి. ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం పోలీసులు ఛార్జి షీటు దాఖలు చేశారు.
క్రమం తప్పకుండా కోర్టు విచారణ కూడా జరిగేలా చూశారు. దిశ ప్రత్యేక న్యాయవాది ఈ కేసులో వాదనలు వినిపించారు. నిందితుడు శశికృష్ణకు ఈ 9 నెలల్లో కనీసం బెయిల్ కూడా రాకుండా చూశారు. చివరికి 257 రోజుల్లో నిందితుడు కాస్తా దోషిగా నిరూపణ అయి ఉరిశిక్ష పడేలా దిశ చట్టం పనిచేసింది. అంతిమంగా పోలీసుల దర్యాప్తు, కోర్టు శిక్ష ప్రక్రియలో స్పష్టంగా దిశ మార్పు కనిపించిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
సరైన సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేయడం వల్లే నిందితుడిని దోషిగా నిరూపించి ఉరిశిక్ష వేయించగలిగామని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధి వల్లే ఈ కేసులో ఇంత త్వరగా తీర్పు వచ్చిందన్నారు. ఇదంతా దిశతో పాటు పోలీసులందరి టీమ్ వర్క్ అన్నారు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకోవడం వల్లే ఇంత త్వరగా తీర్పు వచ్చేలా చేయగలిగామన్నారు.