రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు... రూ.3200 కడితే రూ.32వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోను ప్రధానంగా రైతులకు సంబంధించి వారు నష్టపోకుండా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో వారికి రుణ సౌకర్య పరిమితిని పెంచడంతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టమాటా సాగుచేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. టమాటా పంటను సాగుచేసే రైతులకు బీమా చేసే సదుపాయాన్ని ఐఎఫ్ఎఫ్సీఓ - టీఓకేఐఓ కంపెనీకి ఇచ్చారు.
డిసెంబరు 15 లోపు చెల్లించాలి
పంటను బీమా చేసుకున్న తర్వాత ఎకరాకు గరిష్టంగా రూ.32వేలు పరిహారంగా చెల్లిస్తారు. అందులో పది శాతం రూ.3200 ను బీమా కంపెనీకి ప్రీమియంగా చెల్లించాలి. ఈ రూ.3200ల్లో రూ.800, రాష్ట్రం రూ.800 చొప్పున రూ.1600 చెల్లిస్తాయి. మిగతా రూ.1600 రైతులు చెల్లించాలి. రబీ సీజన్ లో టమాటా సాగుచేస్తున్న రైతులు అక్టోబరు ఒకటోతేదీ నుంచి డిసెంబరు 15వ తేదీలోపు రైతులు రుణాలు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకోని రైతులు కామన్ సర్వీస్ కేంద్రం ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రైతులు తమ బీమాను టమాటాకు కాకుండా వేరే ఇతర పంటకు మార్చుకోవాలనుకుంటే చివరి తేదీ అయిన 15వ తేదీకి రెండురోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

టమాటాతోపాటు జీడికి కూడా
టమాటాతోపాటు తొలిసారిగా జీడి పంటకు కూడా బీమా కల్పిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల జీడిపంటను రైతులు నష్టపోతే వారికి కూడా బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తారు. ఈ పంట సాగుచేస్తున్నవారు ఈనెల 15వ తేదీలోపు ప్రీమియం చెల్లించాలి. ఎకరా తోటకు రూ.1600 చొప్పున అన్నదాతలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబరు ఒకటోతేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ మధ్య తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రత, అనావృష్టి, అతివృష్టితో పంట దెబ్బతింటే ఎకరాకు రూ.12,800 పరిహారం అందుతుంది. అలాగే మొక్కజొన్నకు కూడా రైతులకు బీమా పరిహారం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా వ్యవసాయశాఖ కార్యాలయంలో లభిస్తాయని, తెలుసుకొని అన్నదాతలు దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications