విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం.. అప్పటి నుంచే అమల్లోకి !
ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు మరో తీపి కబురు ప్రకటించనుంది. ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తున్న సర్కారు.. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15000 నగదు జమ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కేవలం టెన్త్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ ను, ఇంటర్ విద్యార్థులకు సైతం పొడిగించారు.
అలానే అధికారంలోకి రాగానే పెద్ద పండుగ పేరుతో ప్రతి బడిలో మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో సైతం మార్పులు తెచ్చారు. ఇక ఇప్పుడు మరో కొత్త పథకంతో విద్యార్థులకు మేలు చేకూర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీలోని గురుకుల, వసతి గృహ విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇప్పటి వరకు అన్ని వసతి గృహాలలో గల విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో అక్కడక్కడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వసతి గృహాలలో చదివే విద్యార్థులకు స్పెషల్ కిట్స్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే విషయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లాడించారు. మంత్రి చెప్పిన ప్రకటన మేరకు, విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాస్మోటిక్ కిట్స్, నైట్ డ్రెస్ లను ప్రభుత్వం అందజేయనుంది.
ప్రభుత్వం కాస్మోటిక్ కిట్స్ ఇవ్వడం ద్వారా వసతి గృహాలలో విద్యార్ధులు ఎదుర్కొన్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు గురుకులాలు, వసతి గృహాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో అదనంగా మరుగుదొడ్లు నిర్మించడం, అలాగే ఉచిత నీట్ కోచింగ్ సెంటర్లు 10కి పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం చేపట్టిన నిర్ణయంతో ఎందరో పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications