ఏపీ ప్రభుత్వ ఆదేశాలు -మాస్కు లేకుంటే ఫైన్ : షాపుల్లోకి అనుమతిస్తే క్లోజ్- శుభకార్యాల్లో ఇలా..!!
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఇప్పటి వరకు 32 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో తొలిగా గుర్తించిన ఈ కేసు..ఇప్పుడు గుజరాత్..మహారాష్ట్ర లోనూ బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్క రోజే ఏడు కేసులు బయట పడ్డాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యం పైన నిఘా పెడుతున్నారు. ఏయిర్ పోర్టు ల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇదే సమయంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నోరు, ముక్కు పూర్తిగా మూసి ఉండేలా మాస్క్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధించడాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేసారు. మార్గదర్శకాల అమలు పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.

మాస్కు లేకుంటే రూ 100 జరిమానా
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో మాస్క్ ధరించని వ్యక్తులను దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లోకి అనుమతిస్తే పరిస్థితుల తీవ్రతను బట్టి యజమాన్యాలకు రూ. 10-20 వేలు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. దీంతో పాటుగా.. కరోనా నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, ఇతర దుకాణాలను 1-2 రోజుల పాటు మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది.

500 మంచి ఒకే చోట ఉండకూడదు
నిబంధనల ఉల్లంఘనలపై వాట్సప్ ద్వారా 8010968295 నంబర్కు ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అవకాశం కల్పించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో 500లకు మించి ప్రజలు పాల్గొనడానికి వీలు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్క్ ధారణ, భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే నని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ చట్టం-2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Recommended Video

కఠినంగా అమలు చేయాల్సిందే
ఇక, తీవ్రత తగ్గినా ..గతం కంటే కేసుల నమోదు తగ్గిపోయినా.. కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వైరస్ సైతం విస్తరిస్తుండటంతో.. ఏపీ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాల్సిందేనని జిల్లాల యాంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. వీటిని తక్షణమే అమల్లోకి తెస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. వీటి అమలు బాధ్యతను జిల్లా అధికార యంత్రాగానికి ఇచ్చింది.












Click it and Unblock the Notifications