అన్నా క్యాంటీన్ల నిర్వహణ ,ధరలపై ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అన్నా క్యాంటీన్ల నిర్వహణతో పాటుగా ధరల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 15న రాష్ట్రంలో రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఆ తరువాత రెండు విడతల్లో మరో 103 ప్రారంభం కానున్నాయి. ధరలను ఖరారు చేసారు.
ప్రారంభానికి సిద్దం
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో టీడీపీ హయంలో రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. ఎన్నికల సమయంలోనే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించటంతో పాటుగా..నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు విడతల్లో
ఈ నెల 15న రాష్ట్రంలో తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. మరో 103 అన్నా క్యాంటీన్లను 80, 23 చొప్పున రెండు విడతల్లో ప్రారంభించనున్నారు. హరేక్రిష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంటీన్లను నిర్వహించనున్నారు. అన్నా క్యాంటీర్ల నిర్వహణకు పిలిచిన టెండర్లలో ఈ హరేక్రిష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ కు అవకాశం దక్కింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్నాహ్నం లంచ్, రాత్రికి భోజనం ఈ క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి తీసుకురాన్నారు. వీటికి సంబంధించి ధరలను కూడా ఇప్పటికే ఖరారు చేసారు.
తక్కువ ధరలకే
అన్నా క్యాంటీన్లలో అతి తక్కువ ధరలకు ఆహార పదార్ధాలు అందించాలని నిర్ణయించారు. ఉదయం టిఫిన్ రూ 5, మధ్నాహ్న భోజనం రూ 5, రాత్రికి భోజనం రూ 5 చొప్పున అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇదే అంశాన్ని తాజాగా అసెంబ్లీ వేదికగానూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ మున్సిపాల్టీ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ఈ నెల 10వ తేదీ లోగా క్యాంటీన్ల ఏర్పాటు పనులు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications