APSRTC బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు- వెన్నెల సర్వీసుల్లో-ఏజెన్సీ స్పెషల్
ఏపీలో కరోనాతో అల్లాడుతున్న ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఊరట నిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా రోగుల్ని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ నుంచి రవాణామంత్రి పేర్నినాని ఈ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసిన వెన్నెల స్లీపర్ సర్వీస్ను ప్రారంభించారు. ప్రతీ బస్సులోనూ పది మంది రోగులకు చికిత్స అందిస్తామన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రయోగం
కరోనా రోగుల కోసం ఏపీఎస్ఆర్టీసీ మరో ప్రయోగానికి సిద్ధమైంది. గతేడాది కరోనా సమయంలో ఆర్టీసీ బస్సుల్ని కోవిడ్ టెస్టింగ్ సెంటర్లుగా వాడిన ఆర్టీసీ.. ఈసారి వాటిని ఆక్సిజన్ బెడ్లుగా మారుస్తూ రోగుల్ని ఆదుకునేందుకు సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు దర్శనమివ్వబోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగుల కోసం ఎంపిక చేసిన బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు.

ఏజెన్సీలో గిరిజనుల కోసం
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం ఆర్టీసీ వెన్నెల బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా విశాఖ ఏజెన్సీలో కరోనా వైద్యం కోసం నాటు పడవల్లో వెళ్తూ గిరిజనులు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా వైద్య సదుపాయాలు అందని మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులనే తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చి సేవలు అందించనున్నారు.

ప్రతీ బస్సులో పది ఆక్సిజన్ బెడ్లు
కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ప్రతీ ఆర్టీసీ బస్సులోనూ పది ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం వెన్నెల స్లీపర్ సర్వసులను ఎంచుకున్నారు. ఆర్టీసీ ప్రత్యేకంగా రూపొందించిన వెన్నెల బస్సును రవాణామంత్రి పేర్నినాని, ఆర్టీసీ ఎండీ ఠాకూర్తో కలిసి పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయగూడెం, కేఆర్ పురం పీహెచ్సీల పరిధిలో ముందుగా ఈ ఆర్టీసీ బస్సుల్ని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications