ఏపీ సచివాలయాలకు జగన్ కొత్త టార్గెట్- ప్రత్యేక కాల్ సెంటర్ - ఫైల్ ఆగిందా అంతే సంగతులు..
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై సచివాలయాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత సమయాన్ని విధించబోతోంది. ప్రజల నుంచి వచ్చే సమస్యలకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపించే విధంగా ఓ ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. సీఎం జగన్ ఇవాళ దీన్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేక కాల్ సెంటర్ కు మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఆధారంగా ఇచ్చిన సమయంలోగా సమస్యలను పరిష్కరించేలా జగన్ ఆదేశాలు ఇచ్చారు.
సచివాలయాల్లో రెడ్టేపిజం...
ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లా మారిపోతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వందల కొద్దీ విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించే పరిస్ధితి లేకపోవడంతో సిబ్బంది అక్కడే పోగు పెడుతున్నారు. దీంతో సాధారణ ప్రభుత్వ కార్యాలయాలకూ, వీటికీ తేడా లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై దృష్టిసారించిన ప్రభుత్వం తాజాగా సచివాలయాల వ్యవస్ధలో మరో కొత్త శకానికి నాంది పలికింది. నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారం జరిగేలా కొత్త ఏర్పాటు చేసింది.
ప్రత్యేక కాల్ సెంటర్ ప్రారంభం..
గ్రామ, వార్డు సచివాలయాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ పీఎంయూగా పిలిచే ఈ కాల్ సెంటర్ ప్రజల నుంచే వచ్చే సమస్య ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ ఆగినా అప్రమత్తం చేయనుంది. నిర్దేశిత సమయంలోగా సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులను ఈ కాల్ సెంటర్ అప్రమత్తం చేస్తుంది. దీంతో సమస్యలు పోగుపడటం అనేది ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
ఫంక్షనల్ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం..
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ప్రస్తుతం నాలుగు సేవలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి మరో 543 సేవలను ఇందులో చేరుస్తారు. అప్పటి నుంచి పూర్తిగా ఈ సేవల అమలుపై పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు ఫంక్షనల్ బ్రాడ్ బ్రాండ్ తో అన్ని సచివాలయాలను అనుసంధానం చేస్తారు. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేని 512 సచివాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు..
ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాల మీద సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సచివాలయాల్లో ఉద్యోగులతో పాటు వాలంటీర్లకూ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలని జగన్ సూచించారు. త్వరలో సచివాలయాల్లో ఖాళీల భర్తీతో పాటు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని దరఖాస్తుల సమాచారాన్ని సీఎంవోకు పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.