ఏపీలో మరిన్ని ఉద్యోగాలు- జగన్ గ్రీన్ సిగ్నల్
అమరావతి: ఏపీలో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇటీవలే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువు కూడా ముగిసింది. స్టేల్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దీన్ని పర్యవేక్షిస్తోంది. 6,100 కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గత ఏడాది నవంబర్ లోనే విడుదలైంది. రాత పరీక్షలను త్వరలోనే చేపట్టనుందీ బోర్డ్.
కొడాలి నానిపై నందమూరి హీరో- నారా లోకేష్తో చర్చలు..!!
63 సీపీడీఓ పోస్టులు..
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- మహిళా, శిశుసంక్షేమ శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. 63 శిశు అభివద్ధి ప్రాజెక్ట్ అధికారి (సీపీడీఓ) నియామకాలను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవ్వాళ- తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆంగన్వాడీలపై సమీక్ష నిర్వహించారాయన. ఈ సందర్భంగా సీపీడీఓ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలపై సంతకం చేశారు.
ఆంగన్వాడీల అభివృద్ధి..
ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాడు-నేడు కింద ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని ఆంగన్వాడీలను అభివృద్ధి చేస్తోన్నామని, వాటిల్లోమౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ఆంగన్వాడీలను తీర్చిదిద్దాలని అన్నారు.
పౌష్టికాహార పంపిణీలో..
పిల్లలకు పాలు, గుడ్లు లాంటి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడంలో నిర్లక్ష్యాన్ని వహించకూడదని సూచించారు. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పిల్లలకు ఫ్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ఫ్లేవర్డ్ మిల్క్ పంపిణీ చేయాలని సూచించారు. దీనికి అవసరమైన షెడ్యూల్ రూపొందించుకోవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
బోధనపైనా..
ఆంగన్వాడీల్లో పిల్లలకు బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యంపై విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా తరచూ దృష్టి సారించాలని, ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకోవాలని చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలను నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు.
మహిళా, శిశు సంక్షేమానికీ..
ఆంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో జాయిన్ అయ్యేది పేద, బడుగు, బలహీన కుటుంబాలకు చెందిన పిల్లలే కావడం వల్ల వారికి ప్రభుత్వం తరఫున తోడుగా నిలబడాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 10 నుంచి 12 సంవత్సరాల వయస్సులో నాణ్యమైన విద్యా బోధన అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని చెప్పారు.