విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం... జూనియర్ కాలేజీలపై చర్యలకు డీజీపీకి ప్రభుత్వం లేఖ...
ట్యూషన్ ఫీజులు చెల్లించేదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కార్పోరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల తీరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ డీజీపీకి లేఖ రాశారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు పదో తరగతి సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలు/ప్రిన్సిపాల్స్పై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు. పలు కాలేజీ యాజమాన్యాలు అదనపు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని... ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని షరతులు పెడుతున్నాయని పేర్కొన్నారు.
జూనియర్ కాలేజీ యాజమాన్యాల తీరుతో విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోంది. ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి సకాలంలో సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఐఐటీల్లో సీట్లు పొందిన చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యాల తీరుతో సకాలంలో సర్టిఫికెట్లు పొందలేకపోతున్నామని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పేర్కొన్నారు. కాబట్టి అలాంటి కాలేజీ యాజమాన్యాలపై సత్వరం చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.
ఇదిలా ఉంటే,డైట్ మేనేజ్మెంట్ కోటా (2019- 21 బ్యాచ్) విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 2019లో అడ్మిషన్ పొందిన డైట్ విద్యార్థులకు ఇప్పటివరకూ తరగతులు నిర్వహించి.. ఇప్పుడు అర్ధాంతరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులతో సంప్రదించి కాలేజీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు