ఆ రైతులకు చంద్రబాబు శుభవార్త: 288రూపాయలకే ఇన్సూరెన్స్.. అప్పటివరకే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీదనే కాదు, పాడి మీద కూడా ఆధారపడి జీవనం సాగిస్తారు. అటువంటి పాడి రైతుల కోసం ప్రభుత్వం శుభవార్త అందించింది. పాడి పశువుల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులు ఏ విధంగా అయితే పంటలను కాపాడుకుంటారో.. అదేవిధంగా పాడి పశువులను కూడా కాపాడుకుంటారు. అటువంటి పాడి పశువులకు బీమా కల్పిస్తూ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ప్రీమియం వాటాలో 15% రైతు చెల్లిస్తే బీమా
పశువులు అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా మరణించినప్పుడు రైతులకు ఆర్థిక నష్టం జరగకుండా వారికి ఆర్థిక సహాయం అందించటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. రాష్ట్రంలో పాడి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పశువుల బీమా పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పశువుల బీమా పథకంలో భాగంగా ప్రీమియం వాటాలో 15% రైతు చెల్లిస్తే 85% ప్రభుత్వం చెల్లిస్తుంది.

రైతు కేవలం 288 రూపాయలు మాత్రమే బీమా
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి పెంపుడు జంతువులకు ఈ బీమా పథకం వర్తిస్తుంది. పశువుల విలువను బట్టి పరిహారాన్ని నిర్ణయించడం జరుగుతుంది గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలకు, 100 గొర్రెలు లేదా మేకలకు, 50 పందులకు ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా లో భాగంగా 30 వేల రూపాయలు విలువైన పశువుకు రైతు కేవలం 288 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
పశువులకు 30 వేల రూపాయలు బీమా
15వేల రూపాయలు విలువైన పశువుకు 144 రూపాయలు, ఆరువేల రూపాయలు విలువైన గొర్రెలు లేదా మేకలకు 27 రూపాయలు మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. మేలు జాతి ఆవులు గేదెలకు 15వేల నుండి 30వేల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. మేలు జాతి ఎద్దులు, దున్నలు 30 వేల రూపాయలు బీమా వర్తిస్తుంది. నాటు ఎద్దులు, దున్నలు 15వేల రూపాయల బీమా, గొర్రెలు మేకలకు ఆరువేల రూపాయల బీమా అందుతుంది.
ఉచిత పశు వైద్య శిబిరాలలో పశువులకు పరీక్షలు, బీమా కోసం దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరికొద్ది రోజులే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి 31వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలలో పశువులకు పరీక్షలతో పాటు, బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. ఈ బీమా నేరుగా రైతుల ఖాతాకే లింక్ అవుతుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications