జగన్పై బాంబు: సాక్షి సహా ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న బాబు?
హైదరాబాద్: వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం త్వరలో ఆదీనంలోకి తీసుకోనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు.
ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న కేసులో జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. జగతి పబ్లికేషన్స్, (సాక్షి పత్రిక యాజమాన్య సంస్థ) జననీ ఇన్ఫ్రాలతో పాటు మరికొన్ని సంస్థలను తమ అధీనంలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని సమాచారం.
ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల చట్టం 2015ను ఉపయోగించుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. కేంద్ర హోం, న్యాయ శాఖలు ఇప్పటికే పచ్చజెండాను ఊపాయి. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది.
చట్టం అమల్లోకి రాగానే జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ముగించేందుకు కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాతఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
ఈడీ ఎటాచ్మెంటులో ఉన్న ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని, ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేసి సత్వర న్యాయానికి కృషి చేస్తామని యనమల చెప్పారు.
ఇటీవల చంద్రబాబు, టిడిపి నేతలు సాక్షి మీడియా పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న వైసిపి అధినేత జగన్.. ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుందని, ఆ లెక్కన సాక్షి మీడియా కూడా ప్రభుత్వానికి చెందినదే అవుతుందని చెబుతున్నారు.
ఏపీ సర్కారు వద్ద ఉన్న వివరాల ప్రకారం.. జగన్ యజమానిగా ఉన్న కంపెనీలకు చెందిన సుమారు రూ.2 వేలకోట్ల విలువైన ఆస్తులు ఈడీ ఆటాచ్మెంటులో ఉన్నాయి. వీటిల్లో ఇండియా సిమెంట్స్, రాంకీ, భారతీ సిమెంట్స్, క్యారమిల్ ఆసియా హోల్డింగ్స్, లేపాక్షీ నాలెడ్జ్ హబ్, ఇందూ ప్రాజెక్ట్స్ తదితర సంస్థలకు చెందిన ఆస్తులున్నాయి.