ఏపీలో వంటనూనెల ధరల మంట-బ్లాక్ మార్కెటింగ్ - సర్కార్ కీలక ఆదేశాలు
ఏపీలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కు తోడు, అంతర్జాతీయ పరిణామాలు కలిసొచ్చి ధరలు మోత మోగిస్తున్నాయి. దీంతో ప్రభుత్వంంపై ఒత్తిడి పెరుగుతోంది. ధరల మంటపై సామాన్యులతో పాటు విపక్షాలు కూడా విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ సమీక్ష నిర్వహించింది.
ఏపీలో వంటనూనెల ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నిత్యాయవసర సరుకులను , ముఖ్యంగా వంట నూనెలను నిర్ధేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసిన బైండోవర్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
సామాన్య ప్రజలకు వంటనూనెలు, నిత్యవసర సరకుల ధరల విషయంలో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉందని...దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను మంత్రి కారుమూరి ఆదేశించారు. రైతు బజారులు, మున్సిపల్ మార్కెట్ల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు వంటనూనెలు అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రణాళిక శాఖ అందిస్తున్న నివేదికల ఆధారంగా మండలాల వారిగా ఉన్న వంటనూనె రెట్లను ఎప్పటికీ అప్పుడు అధికారులు పరిశీలించాలని , క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు అర్ధం చేసుకొని , నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు..ఎక్కడ కూడా అధికారులు సామన్య ప్రజలకు మేలు జరిగే విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని మంత్రి సూచించారు.
ప్రముఖ బ్రాండ్ ల తయారీ ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించాలని, ఇంపోటర్స్, సప్లైయర్స్ తో సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.. లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష కూడా ఇదే నని కాబట్టి అధికారులు తీసుకునే చర్యలు ద్వారా సత్ఫలితాలు ఇచ్చి ధరలు పెరగకుండా నియత్రించగలిగాలని మంత్రి తెలిపారు.