గిరిజనులకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ..రైతు భరోసా కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది .గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం, వారికి పౌష్టికాహారం అందించడం, గిరిజనులకు ఉపాధి కల్పించి ప్రోత్సహించడం వంటి అంశాలపై ఏపీలోని వైసీపీ సర్కార్ దృష్టిసారించింది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో గిరిజన ఉత్పత్తుల కొనుగోలు రైతు భరోసా కేంద్రాలు ద్వారానే జరుగుతాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలలో గిరిజన ఉత్పత్తుల కొనుగోళ్లను నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గిరిజన ప్రాంతాలలోని సహజ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం సులభమవుతుందని, అందరికీ గిరిజన ఉత్పత్తులు గ్రామాలలోని లభ్యమవుతాయని పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా గిరిజన ఉత్పత్తుల సేకరణ, అమ్మకాలు సమన్వయంతో జరుగుతాయని భావిస్తున్నారు.
గిరిజన ఉత్పత్తులైన తేనే , చింతపండు , నరమామిడి , కొండ చీపుర్లు ఇలా అనేక ఉత్పత్తులను విక్రయించనున్నారు . రైతు భరోసా కేంద్రాలలో గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ గురించి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తులను విక్రయించనున్నారు .
ఇటీవల గిరిజన సంక్షేమం కోసం, తండాలలోఉండే మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్'అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. అందులో భాగంగా రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు గిరిజన ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించేలా నిర్ణయం తీసుకుని గిరిజనుల ఉపాధికి ప్రోత్సాహం అందిస్తోంది.