ఎన్టీఆర్ పేరుతో జిల్లా : సీఎం జగన్ "కొత్త" వ్యూహం వెనుక : ఉద్యోగులు - కేంద్రం సహకరించేనా..!!
ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించాయి. రాత్రికి ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త నిర్ణయం అమలు దిశగా సమాచారం బయటకు వచ్చింది. ఏపీలో 2019 ఎన్నికల ముందే జగన్ ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా.. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు కొత్త జిల్లాల నోటిఫికేషన్ జారీ చేయటానికి రంగం సిద్దమైంది. ఆలోచన పాతదే అయినా..ఆకస్మికంగా ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియ అమలు దిశగా ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
2019 ఎన్నికల సమయంలోనే హామీ
ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చేలా జగన్ అప్పట్లోనే హామీ ఇచ్చారు. దీంతో..జిల్లాలో 25 జిల్లాలు... అరకు పార్లమెంటరీని రెండుగా చేయటంతో ఆ సంఖ్య 26 జిల్లాలకు చేరనుంది. కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవికాక.. అక్కడక్కడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్నచిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది.
అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది.
కమిటీల నివేదికలు సిద్దంగా
ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి.. సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి.. దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు.
వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల అయ్యే వ్యయాన్ని ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది.
ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్
ఈ రోజు లేదా రేపు.. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇస్తారు. తుది నోటిఫికేషన్లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్ తేదీని పేర్కొంటారు.
ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. అయితే, కేంద్రం జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లాల సరి హద్దులు మార్చరాదనే నిబంధన తీసుకొచ్చింది.
మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు
కరోనా కారణంగా అది పూర్తి కాలేదు. అయితే, రాష్ట్రం దానిని అధిగమించి మందుకు వెళ్తుందా.. లేక, ప్రత్యామ్నాయలు సిద్దం చేసిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ కొత్త జిల్లాల ప్రక్రియలో రెవిన్యూ ఉద్యోగులదే కీలక పాత్ర. మరి..ఉద్యోగులు దీనికి సహకరిస్తారా అనేది మరో ఆసక్తి కర అంశం.
ఇక, కొత్త జిల్లాలకు పేర్ల విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గుడివాడ కేంద్రంగా రాజకీయ వివాదం సాగుతున్న పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంలో ఈ నిర్ణయం వెనుక జగన్ భారీ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కానీ, పలు జిల్లాల హద్దులు మార్పు..ప్రాంతాల పేర్లు ఖరారు పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ జారీ ద్వారా.. రాజకీయంగా ఏపీలో కొత్త చర్చ మొదలు కానుంది. వ్యూహాత్మకంగానే సీఎం జగన్ ఈ సమయంలో కొత్త జిల్లాల అంశం తెర పైకి తెచ్చినట్లుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.