ఎపిలో అటవీ ప్రాంతాలకు ఫీడర్ అంబులెన్సులు...దేశంలోనే తొలిసారి...
అమరావతి: మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఏజన్సీ వాసుల తక్షణ వైద్య సేవల కోసం ద్విచక్ర వాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మొదటి భవనం వద్ద మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ఈ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. మొదటి విడతగా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు గాను ద్విచక్ర వాహనాలతో అనుసంధానమై ఉండే 122 ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చారు.

ఫీడర్ అంబులెన్స్ సేవలు...దేశంలోనే తొలిసారి...
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఎపిలోనే ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిని ప్రయోగాత్మకంగా పిపిపి పద్ధతిలో సేవలు వినియోగించనున్నట్లు తెలిపారు.

మన్యం ప్రాంతవాసులకు...సత్వర వైద్య సేవలు...
ఈ ఫీడర్ అంబులెన్స్ ల కోసం ఒక్కో వాహనానికి ప్రభుత్వం రోజుకు రూ. 2,100 వెచ్చించనుందని చెప్పారు. ప్రతి ఐటిడిఏ పరిధిలో రెండు లేదా మూడు 108 అంబులెన్స్లకు ఒక్కో ఫీడర్ అంబులెన్స్ను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి వల్ల మన్య ప్రాంతంలోని గర్భిణీ మహిళలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన రోగులు, ప్రమాదాలకు గురైన వారికి సత్వరం వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు.

ఒక్క వాహనంలో...మందులు, పరికరాలు
ఈ వాహనంలో పేషెంట్ పడుకునే విధంగా బెడ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్ను కూడా అమర్చినట్టు చెప్పారు. ఈ ఫీడర్ అంబులెన్స్ లో సుమారు 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.

ఏజన్సీల వారీగా...వాహనాల కేటాయింపు
రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు, అటవీ ప్రాంతాలకు సైతం ఈ అంబులెన్స్లు సులభంగా, త్వరగా చేరుకోగలవన్నారు. 108 టోల్ ఫ్రీ నంబర్ నుంచి ఫోన్ వచ్చిన సుమారు గంటలోపే సంఘటన స్థలానికి ఇవి చేరుకుంటాయని, అలాగే 24 గంటల పాటు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అంబులెన్స్ లను శ్రీశైలంకు 6, కెఆర్ పురంకు 8, చింతూరుకు 6, రంపచోడవరంకు 21, పాడేరుకు 42, పార్వతీపురానికి 24, సీతంపేట ఐటిడిఏకి 15,
కేటాయించామన్నారు.












Click it and Unblock the Notifications