రివర్స్: ఇప్పుడు కేసీఆర్కు ఇరకాటం, 43 ఫిట్మెంట్కు బాబు అంగీకారం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్లుగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే, బకాయిలు రూ.వంద కోట్లు కూడా చెల్లించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.
బకాయిల చెల్లింపు కుదరదని ప్రభుత్వం చెబుతోంది. బకాయిలను బాండ్ల రూపంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 43 శాతం ఫిట్మెంట్తో ఏపీ ప్రభుత్వంపై రూ.936 కోట్ల భారం పడుతుంది. అదే 2004 నుండి బకాయిలు చెల్లించవలసి వస్తే మరో రూ.1085 కోట్ల భారం పడనుందని చెబుతున్నారు.
43 శాతం ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, బకాయిలు రూ.100 కోట్లు కూడా చెల్లించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఆర్టీసీ సంఘాలతో కేసీఆర్ చర్చలు
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం చర్చలు జరపనున్నారు. టీఎంయూ, ఈయూ నేతలు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి, కార్మిక సంఘాలు అన్ని అంశాల పైన కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రివర్స్
ఆర్టిసీ సమ్మె పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తొలుత చిక్కుల్లోకి నెట్టినట్లే కనిపించింది. తెలంగాణ ఆర్టీసి కార్మికులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం భారీగా వేతనాలను పెంచాలని ఆలోచిస్తోందని ఒకరిద్దరు మంత్రులు మంగళవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనడాన్ని బట్టి, తెలంగాణ ఇచ్చినంత మనం ఇవ్వలేమని చంద్రబాబు అనడాన్ని బట్టి అది అర్థమవుతోంది.
అయితే, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్ పైన ఏపీ ప్రభుత్వమే తొలి నిర్ణయం తీసుకోవడం ద్వారా.. కేసీఆర్ను రివర్స్లో ఇబ్బందుల్లోకి నెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.