ట్యాపింగ్పై బాబు సీరియస్: కెసిఆర్కు చిక్కు తప్పదా, నోటీసులొస్తాయా?
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాల్ డేటా పైన హైకోర్టు స్టే విధించినప్పటికీ... ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ట్యాపింగ్ వ్యవహారంలో 4గురు సీనియర్ అధికారులు ఆపరేటర్లకు రాసినట్లుగా చెబుతున్న లేఖలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో, ఈ విషయంలో దూకుడు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్, పార్టీ కార్యాలయం ఇంఛార్జ్ టిడి జనార్దన్, ఎంపీలు గరికపాటి మోహన్ రావు, సిఎం రమేష్ తదితరుల ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ ఐపిఎస్లు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు మొబైల్ ఆపరేటర్లకు ఇచ్చిన లేఖల ప్రతులు ఏపి ప్రభుత్వం వద్ద ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఈ లేఖలను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రంలోని ఇద్దరు మంత్రులను ఆదేశించారని సమాచారం. ట్యాపింగ్, కాల్ డేటా వివరాలపై సుప్రీం కోర్టు, హైకోర్టు, విజయవాడ కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు, స్టే తదితర అంశాలపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించారని సమాచారం.
ట్యాపింగ్కు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలు, లేఖలు, కోర్టు ఆదేశాలు తదితర వివరాలతో ఏపీ నిఘా విభాగం ఒక నివేదికను తయారు చేస్తోందని తెలుస్తోంది. ఈ నివేదిక వచ్చాక కేంద్రమంత్రులకు పంపిస్తారని, ఈ నివేదిక ఆధారంగా కేంద్ర హోంమంత్రికి నివేదించనున్నారు.
ఒక రాష్ట్రం, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ఇందులో బ్యూరోక్రాట్లు లిఖిత పూర్వకంగా లేఖ రాయడంపై కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఓ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట ప్రకారం నేరమని, అలాగే ముందస్తుగా కేంద్ర హోంశాఖ అనుమతి కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఒక తాఖీదు వచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను శిరసావహించాలని, అదే విధంగా ఏపీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా, వ్యక్తిగత స్వేచ్చను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తెలంగాణ ఉన్నతాధికారుల వ్యవహారశైలిని కేంద్ర హోంశాఖ వద్ద ప్రస్తావించాలని భావిస్తున్నారట.
ఫోన్ ట్యాపింగ్.. సిఐడి పిటిషన్ పైన విచారణ వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. మత్తయ్య, ఆయన భార్య, మరో ఇద్దరి కాల్ డేటా ఇవ్వాలని సిఐడి పిటిషన్ వేసింది. కాల్ డేటా ఇవ్వాల్సిందిగా గతంలో సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు 14 వరకు సమయం ఉండటంతో, తమకూ గడువు ఇవ్వాలని హైకోర్టును సర్వీస్ ప్రొవైడర్లు కోరారు.