కరోనా అనుమానమా ? ఓ మిస్డ్ కాల్ తో ఆన్ లైన్లో డాక్టర్లు రెడీ - ఏపీలో వైఎస్సార్ టెలిమెడిసిన్..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విదేశాల తరహాలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరుకు మిస్ కాల్ ఇస్తే చాలు సదరు బాధితులను గుర్తించి అధికారులు, డాక్టర్లు స్పందిస్తారు. ఆన్ లైన్ ద్వారానే సూచనలు, సలహాలు అందిస్తారు. దీంతో కరోనా బాధితులు కూడా ఎలాంటి సిగ్గూ బిడియం లేకుండానే వైద్య సేవలను పొందేందుకు వీలు కలగనుంది.

వైయస్సార్ టెలీ మెడిసిన్- ఎలా పనిచేస్తుందంటే..
ఏపీలో కరోనా వైరస్ పై పోరు కోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు 14410 కేటాయించింది. ఈ నంబరుకు కరోనా లక్షణాలు ఉన్న వారు తమ సెల్ ఫోన్లో మిస్ కాల్ ఇస్తే చాలు అక్కడి సిస్టమ్ ఆ మొబైల్ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రోగికి కాల్ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.
రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు. రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్ను స్వీకరించి, కాల్చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్-19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.

తీవ్రత ఉంటే ఆస్పత్రులకు తరలింపు..
ఓసారి టెలీ మెడిసిన్ రికార్డుల్లో నమోదైన తర్వాత అవసరాన్ని బట్టి వీడియో కన్సల్టేషన్ కూడా అందిస్తారు. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు తరలించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు. కోవిడ్-19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పనతో పాటు ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు సిద్ధం చేస్తారు. ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.

స్వచ్ఛంద సేవకు డాక్టర్లు రెడీ...
వైఎస్సార్ టెలీమెడిసిన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ పేర్లు నమోదు చేయించుకున్నారు. డాక్టర్ వైయస్సార్ టెలీ మెడిసిన్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు ఉంటాయి.
టెలి మెడిసిన్ ఉద్దేశం కోవిడ్-19 కేసులను గుర్తించడం, ఐసొలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్కు పంపించడం.
ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు అందించడంగా ఉంటుంది. ప్రతీ డాక్టర్ కూ ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెన్స్ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది. ఈ విధంగామూడంచెలుగా ‘డాక్టర్ వైయస్సార్ టెలీ మెడిసిన్ అమలవుతుంది.












Click it and Unblock the Notifications