ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రారంభం: రెండేళ్లు పూర్తయిన వారికి..!!
ఏపీలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు వారి ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకొచ్చిన తరువాత అప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రతీ గ్రామ..వార్డుల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఇందు కోసం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించారు. ఈ వ్యవస్థ అందుబాటు లోకి తీసుకొచ్చిన తరువాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రారంభం
ప్రోబేషన్ డిక్లరేషన్ అయిన తరువాత ఆ ఉద్యోగులకె సైతం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రయోజనాలు కల్పించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా.. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఈ ఉత్తర్వుల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులను కలిసి కోరారు.
విశాఖ జిల్లాలో తొలి అడుగు
అందులో తొలి అడుగు ఇప్పుడు పడింది. తొలిగా విశాఖ జిల్లాలోని వి. మాడుగుల, దేవరాపల్లి, రావికమతం మండలాల పరిధిలోని దాదాపు 30 మంది వెల్ఫేర్ అసిస్టెంట్ ల ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి విషయంలోనే ప్రభుత్వ అధికారులు ఈ మధ్య కాలంలోనే కీలక సిఫార్సులు చేసారు. వార్డు - గ్రామ సచివాలయ ఉద్యోగులకు సైతం పీఆర్సీ అమలు చేయాలని సీఎస్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే, ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా.. వారు ప్రభుత్వ ఉద్యోగులుగా పీఆర్సీకి అనుమతికి అవకాశం ఉండదు.
భవిష్యత్ ప్రయోజనాలు
అయితే, ప్రోబేషన్ డిక్లరేషన్ అయిన ఉద్యోగులకు..వారు చేస్తున్న సర్వీసులను పరిగణలోకి తీసుకొని వారికి పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. దీని పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలు...సేవల విషయంలో ఇప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా సచివాలయ..వాలంటీర్ వ్యవస్థ పైన ఆధార పడింది. ప్రతీ 50 ఇళ్లకు ఇక వాలంటీర్ ను నియమించటం ద్వారా వారికి సంబంధించిన పూర్తి సమాచారం వారి వద్ద అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వ సేవల్లో కీలకంగా
కరోనా సమయంలోనూ సచివాలయాలు కీలక పాత్ర పోషించాయి. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న ఆర్దిక పరిస్థితుల కారణంగా ప్రొబేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియలో తొలి అడుగు పడటంతో ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం వేచి చూస్తున్న వార్డు - గ్రామ సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. 2021 ముగింపు లోగా, ఈ నెలాఖరులోగా మరి కొంత మంది ఉద్యోగుల ప్రొబేషన్ సైతం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.