సంచలనం:జగన్ను కలిశారని...9 మంది ఉపాధ్యాయులపై వేటు!
విశాఖపట్నం:ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్నందుకు 9 మంది ఉపాధ్యాయులపై వేటు పడింది. ఈ తొమ్మది మందిని సస్పెండ్ చేస్తూ డిఈవో ఆదేశాలు జారీ చేశారు.
సిపిఎస్ ను రద్దు చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల్లో 9 మంది పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను కలిసి సిపిఎస్ రద్దుకు సంబంధించిన వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల మధ్యే వివాదం రేగిన నేపధ్యంలో ఈ తొమ్మిదిమంది టీచర్లపై వేటు పడింది.
ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ఆయనను కలసి వినతిపత్రం సమర్పించిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. ఈ విషయమై వివాదం రేగగా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశం వెళ్లింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వారిపై డిఈవో సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే వీరు జగన్ కు కేవలం సిపిఎస్ వినతి పత్రం ఇవ్వడంతో సరిపెట్టుకోలేదని, తామూ కొంతదూరం పాదయాత్రలో పాల్గొని జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ కలిసి పనిచేస్తామని నినాదాలు చేసినట్లు ఉపాధ్యాయుల్లోనే కొందు ఆరోపించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన డీఈఓ ఆ తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు.
సస్పెండైన టీచర్లు పద్మనాభం, ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందినవారని డీఈవో లింగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందునే వీరిపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.