పరిషత్ పోరుపై అప్పీలుకు ఏపీ సర్కార్-రేపు హౌస్మోషన్-కొడాలి కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రేపు హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల పోలింగ్కు సమయం తక్కువగా ఉన్నందున అత్యవసరంగా ఈ పిటిషన్ను విచారణకు చేపట్టాలని కోరనున్నారు.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనే త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నాని తెలిపారు. పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్ధానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన ఎన్నికలను అడ్డుకుంటున్నాయని కొడాలి ఆరోపించారు.
పరిషత్ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రేపు హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేయనున్నట్లు కొడాలి నాని తెలిపారు. డివిజన్ బెంచ్లో ప్రభుత్వం తరపున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన గుడివాడలో వెల్లడించారు. డివిజన్ బెంచ్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కొడాలి నాని తెలిపారు. డివిజన్ బెంచ్ కూడా 21 రోజుల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇస్తే అందుకు కూడా ప్రభుత్వం సిద్ధమేనన్నారు.