పట్టణ మధ్యతరగతికి జగన్ శుభవార్త- తక్కువ ధరతో సర్కారీ లే అవుట్లు-త్వరలో పాలసీ
ఏపీలో పట్టణ మధ్య తరగతి ప్రజలకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంచడమే కాకుండా వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తున్న వైసీపీ సర్కారు త్వరలో పట్టణ మధ్యతరగతికి కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు వీలుగా లే అవుట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విధానం రూపకల్పన చేయాలని సీఎం జగన్ ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 17 వేల గ్రామాలున్న రాష్ట్రంలో 17 వేల కాలనీలు అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు.
Recommended Video

మధ్యతరగతికి జగన్ తీపికబురు..
గతంలో ఉమ్మడి ఏపీలోనే పట్టణాలు, నగరాల్లో మాజీ సీఎం వైయస్సార్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట ఓ పథకం ఉండేది. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది దాని ఉద్దేశం. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్ టైటిల్తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధిచేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయించేలా దీనికి రూపకల్పన చేయబోతున్నారు.
ఇవాళ జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

మధ్యతరగతికి సర్కారీ భరోసా
ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని సీఎం జగన్ అధికారులతో చెప్పారు.
సరైన టైటిల్ ఉందా? అన్నిరకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారికి ఉన్నాయన్నారు. లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవన్నారు.
వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలని జగన్ సూచించారు. మధ్యతరగతి ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాలు
ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న వైయస్సార్ జగనన్న కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టిపెట్టమని కలెక్టర్లకు చెప్పినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పామన్నారు.లే అవుట్ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయమని చెప్పినట్లు మున్సిపల్ అధికారులకు తెలిపారు.
బస్ బే తోపాటు, సృజనాత్మకంగా బస్టాప్ కట్టమని చెప్పామన్నారు.
పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో దాదాపు 16వేలకుపైగా లే అవుట్స్ వచ్చాయని,
రాష్ట్రంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉంటే.. తాము మరో 17వేల కాలనీలు కడుతున్నామన్నారు. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నట్లు జగన్ తెలిపారు. పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ ఈ కాలనీల్లో తీసుకు రావాలన్నారు.

మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్
అమరావతి పరిధిలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పాలనా రాజధానిగా ఎంపికైన విశాఖలో భీమిలి నుంచి విజయనగరంలో జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్న భోగాపురం వరకూ సముద్ర తీరం వెంబడి 6 లేన్ల బీచ్ రోడ్డు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అధికారులు సీం జగన్కు తెలిపారు.
ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం
చేపడుతున్నామన్నారు. విశాఖపట్నానికి ఇదో చిహ్నంగా మిగిలిపోతుందని సీఎం జగన్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలని సీఎం అధికారులను కోరారు.
పట్టణ గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications