8 జిల్లాలతో విశాఖ ఆర్ధిక ప్రాంతం..! లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు..! ఏపీ సర్కార్ నిర్ణయం..!
ఏపీ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అదే స్ధాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖ కేంద్రంగా భారీ ఆర్ధిక ప్రాంతం(ఎకనమిక్ రీజియన్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గ్రోత్ ఇంజన్ గా విశాఖ ఆర్ధిక ప్రాంతం
2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనమిక్ రీజియన్'ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని అభివృద్ధి చేస్తారు. ఈ 8 జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తారు. ఇందుకోసం ఆయా జిల్లాల్లో లక్ష ఎకరాలు గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారు.

అభివృద్ధి ఇలా..
ప్రస్తుతం 36 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా ఉన్న విశాఖ ప్రాంతంలో 49 బిలియన్ డాలర్ల జీడీడీపీ నమోదవుతోందని తెలిపారు. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు. 6 పోర్టులు, 7 మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన... ఇలా 7 గ్రోత్ డ్రైవర్లను నిర్ణయించారు.
ఫలితాలు ఇలా
విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆస్పత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

విశాఖ-కాకినాడ బీచ్ రోడ్లు
మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.












Click it and Unblock the Notifications