ఏపీలో ఓటీటీలో చదువులు-త్వరలో ప్రత్యేక వ్యవస్ధ- విద్యామంత్రి సురేష్ ప్రకటన
ఏపీలో త్వరలో డిజిటల్ విప్లవం దిశగా విద్యారంగం కూడా అడుగులు వేయబోతోంది. ఇప్పటికే పలు డిజిటల్ మార్గాల్ని పాలనలో వాడుకుంటున్న ప్రభుత్వం.. ఇకపై విద్యారంగంలోనూ దీని ప్రయోజనాల్ని అందిపుచ్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఓటీటీ ఆధారిత విద్యావ్యవస్ధను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
సమీప భవిష్యత్తులో రాష్ట్ర విద్యావ్యవస్థలోకి డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ గుంటూరు జిల్లాలో తెలిపారు.చిలకలూరిపేట రూరల్ మండలం రాజాపేట గ్రామంలో కొత్తగా రూ.6 కోట్ల ఖర్చుతో అత్యాధునిక వసతులతో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను ఆయన ప్రారంభించారు. భవిష్యత్తు అంతా డిజిటల్ రంగానిదే అని ఈ సందర్బంఘా విద్యామంత్రి తెలిపారు.విద్యా రంగంలో ఆన్లైన్ చదువులు కీలక పాత్ర పోషించబోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ప్రత్యేకంగా ఓటీటీలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు విద్యా బోధన చేపట్టేలా ఆలోచిస్తున్నామని తెలిపారు.అందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి పథకంలో 9,10 తరగతుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు కూడా అందజేస్తున్నామని చెప్పారు.

మన దేశంలో ఇప్పటికే విద్యా వ్యవస్థలో డిజిటల్ విప్లవం కొనసాగుతోందని విద్యామంత్రి సురేష్ గుర్తుచేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వంటి అంశాల్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చివరికి పిల్లల మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారా, లేదా కూడా ఆన్లైన్ ద్వారానే పరిశీలిస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా,విద్యా పద్ధతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని, అందుకోసమే ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకు ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాచేయబోతున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications