ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ ? సీఎస్కే, ముంబై సాయం ! జగన్ కీలక ఆదేశాలు..
ఏపీలో క్రీడల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రీడాశాఖపై సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్ని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కొత్త టోర్నీని ప్రారంభించనున్నారు.
క్రీడలు, యువజన సర్వీసులశాఖపై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో''ఆడుదాం ఆంధ్ర'' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో-ఖో పోటీలు ఉంటాయి. బాలురు, బాలికలకు పోటీలు నిర్వహిస్తారు.
దీంతోపాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు.మొత్తం 46 రోజులపాటు ఆటలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు ఉంటాయి.

ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కె మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారని జగన్ తెలిపారు. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తామన్నారు:
భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలన్నారు. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుందన్నారు.
అంబటిరాయుడు, కేఎస్.భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులని జగన్ తెలిపారు. వీరి సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలోకూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలన్నారు.
ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలన్నారు. భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. .












Click it and Unblock the Notifications