పింఛన్ దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ కష్టాలకు చెక్..!
ఏపీలో పింఛన్ దారులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలకు చెక్ పెట్టేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ తాజాగా సాఫ్ట్ వేర్ మార్చడంతో అందుకు అనుగుణంగా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్ లబ్దిదారులకు దీర్ఘకాలంగా ఉన్న ఓ సమస్య తీరబోతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇలా పెన్షన్లు తీసుకునే సమయంలో వృద్ధులైన లబ్దిదారులు తమ వేలి ముద్రల్ని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా స్కానర్లపై వీరి వేలి ముద్రలు తీసుకుని పెన్షన్లు ఇస్తున్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా అరిగిపోయిన వేలి ముద్రలు స్కానర్లపై పడటం లేదు. దీంతో వారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదు.

దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతోంది. పింఛన్ల పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్దిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్ వేర్ ను ఉడాయ్ సంస్థ అప్ డేట్ చేయంతో గతంలో ఉన్న పాత పరికరాలు పనికి రాకుండా పోయాయి. దీంతో ప్రభుత్వం ఉడాయ్ అప్ డేట్ చేసిన సాఫ్ట్ వేర్ పనిచేసే విధంగా కొత్త స్కానర్లను అందుబాటులోకి తెస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు మొత్తం 1,34,450 స్కానర్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన స్కానర్లు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది, లబ్దిదారులు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నూతన పరికరాల సాయంతో ఈ సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications