ఏపీలో ఆ పథకం కింద 13న నిధుల విడుదల: కొత్తవారి కోసం దరఖాస్తుకు గడువు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళే.. కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. దీని విలువ 931 కోట్ల రూపాయలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 47,40,421 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కిట్స్ పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 2,368 కోట్ల రూపాయలను వ్యయం చేసింది ప్రభుత్వం.
నాడు-నేడు, గోరుముద్ద వంటి పథకాలను కూడా కలుపుకొంటే ఈ మూడు సంవత్సరాల్లో విద్యారంగంపై ప్రభుత్వం చేసిన ఖర్చు 52,676 కోట్ల రూపాయలు. ఇక తాజాగా మరో పథకం కింద నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 13వ తేదీన వైఎస్సార్ వాహన మిత్ర కింద నిధులను విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఈ నిధులను విడుదల చేస్తారు.
అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 7వ తేదీ లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూ వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వినియోగించిన వారిని అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఆరు నెలల విద్యుత్ బిల్లును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల అధికారులు ఈ నెల 9వ తేదీలోగా ఆమోదించాల్సి ఉంటుంది. 10వ తేదీన వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లు తుది ఆమోదముద్ర వేస్తారు.