కాపు గర్జన... తుని రైలు దగ్ధం కేసు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేత్రుత్వంలో జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద రైలును తగలబెట్టిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో 17 కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. తుని రైలు ఘటనకు సంబంధించి మొత్తం 69 కేసులు నమోదవగా... గత ఏడాది ప్రభుత్వం 51 కేసులను ఉపసంహరించుకుంది.
కాపులకు రిజర్వేషన్ల డిమాండుతో టీడీపీ హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో 2016లో తునిలో తలపెట్టిన కాపు గర్జన కార్యక్రమం హింసాయుతంగా మారి ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్లోని ఆయుధాలు,ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కూడా మృతి చెందాడు. అప్పటి ఈ ఘటనపై టీడీపీ,వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

తాను కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.అవకాశవాది, గజదొంగ, కులద్రోహి, అంటూ కొంతమంది తనపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఒంటికాలిపై లేచిన ముద్రగడకు ఇప్పుడు కాళ్ళు పడిపోయాయా అని కొంతమంది పోస్టులు పెట్టడం బాధ కలిగించిందన్నారు. ఇవన్న చూశాక తీవ్రంగా కలత చెందానని,అందుకే ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications