ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మళ్లీ అమల్లోకి ఆ పథకం
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మరోసారి ప్రారంభించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 2014 నుండి 2019 మధ్యకాలంలో ప్రజాదరణ పొందిన ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ పథకం నిలిపివేయడం వల్ల అనేక తల్లులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఈ పథకం పునరుద్ధరణతో తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఉచితంగా బేబీ కిట్లు అందజేయనున్నారు. ఈ బేబీ కిట్లో 11 కీలక అంశాలు ఉంటాయి. దోమ తెరతో కూడిన బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్స్. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1,410గా ఉండనుంది. ఈ ఖర్చును రాష్ట్ర బడ్జెట్ నుంచే ప్రభుత్వం భరించనుంది.

ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లోనే జరుగుతున్న నేపథ్యంలో, ఈ కిట్లు తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణకు మరింత దోహదం చేయనున్నాయని అంటున్నారు. శిశువుకు సంబంధించి అన్ని అవసరాలను ఒకే కిట్లో అందించడం వల్ల తల్లులపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా శిశు మరణాల రేటును తగ్గించడంపైనా దృష్టి సారిస్తోందని వివరిస్తున్నారు.
అంతే కాకుండా శుభ్రత, హైజీన్, శిశువు ఆరోగ్యం.. వంటివి ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని బేబీ కిట్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కిట్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఈ పథకాన్ని ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications