నెరవేరిన జగన్ హామీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్: ఆ ఫైల్పై గవర్నర్ సంతకం
అమరావతి: పీఆర్సీ పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఉద్యోగులు యుద్ధాన్ని సాగిస్తోన్న వేళ.. వారికి తీపి కబురు అందింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తాను ఇచ్చిన హామీని వైఎస్ జగన్ నెరవేర్చుకున్నట్టయింది. కొద్దిరోజులుగా నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి తెరదించినట్టయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతిస్తోన్నారు.
ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వీరే: మరో రెండు రాష్ట్రాలకు: సుప్రీం కొలీజియం సిఫారసు
పీఆర్సీ వివాదం తేలాకేనంటూ..
ఆ హామీ- ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు. కొంతకాలంగా దీనిపై అనుమానాలు వ్యక్తమౌతూ వచ్చిన విషయం తెలిసిందే. పీఆర్సీ వివాదం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ విరమణ వయస్సు పెంపుదల ప్రతిపాదనలను ప్రభుత్వం ఉద్దేశపూరకంగా తొక్కి పెట్టిందనే అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పీఆర్సీ వివాదం తేలేంత వరకూ దీన్ని అమలు చేయకపోవచ్చనే వాదనలు సైతం వినిపించాయి.
జీవో విడుదలపై
పీఆర్సీ విషయంలో తాము మెట్టుదిగకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందని, రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రతిపాదనలను అమలు చేసే విషయంలో తీవ్రంగా జాప్యం చేస్తుందని భావిస్తూ వచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు. పదవీ విరమణ వయస్సును పెంచుతామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన జీవో విడుదల కాకపోవడమే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది.
ఫైలుపై గవర్నర్ సంతకం..
వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ, పీఆర్సీ సాధన సమితి ప్రతినిధుల అనుమనాలను పటా పంచలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. దీనిపై సమగ్ర వివరాలతో కూడిన ఫైలును రాజ్భవన్కు పంపించింది. సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఈ ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. సంతకం చేశారు. తన ఆమోదాన్ని తెలియజేశారు.
జనవరి నుంచి అమలు..
సంతకం చేసిన ఫైలును మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. అంటే జనవరి 1 నుంచి ఇప్పటిదాకా రిటైర్ అయిన వాళ్ల సర్వీసును కూడా మరో రెండు సంవత్సరాలకు పొడిగించినట్టయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే గవర్నర్ కార్యాలయ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ అందినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న ప్రతిష్ఠంభన..
ఇదిలావుండగా- పీఆర్సీ పెంపుదల విషయంలో ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన యధాతథంగా కొనసాగుతోంది. మంత్రుల కమిటీతో చర్చించడానికి పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ముందుకు రావట్లేదు. మరోవంక- ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ట్రెజరీ విభాగానికి మరోసారి ఆదేశాలను జారీ చేశారు. వేతనాల చెల్లింపు ప్రాసెసింగ్, అప్లోడ్ను కొనసాగించాలని సూచించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ..ట్రెజరీ ఉద్యోగులు విధులకు హాజరైన విషయం తెలిసిందే.
వేతనాల చెల్లింపులపై..
పోలీసు, న్యాయ శాఖ, మున్సిపల్ శాఖ ఉద్యోగుల వేతనాలను వారు ప్రాసెస్ చేశారు. వేతన బిల్లులను అప్లోడ్ చేశారు. ఇక మిగిలిన శాఖ వేతనాల చెల్లింపులను కూడా ప్రాసెస్ చేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశించారు. ఈ నెలలో ఇదే చివరి రోజు కావడం వల్ల ఈ సాయంత్రంలోగా దీన్ని పూర్తి చేయాలని సూచించారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదికను తమకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు.