ఏపీలో ముందస్తు ఎన్నికలు - తేల్చేసిన సజ్జల..!!
ఏపీలో ముందస్తు ఎన్నికల పైన ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటలో దీని పైన చర్చ జరిగినట్లు జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ సైతం ముందస్తు ఎన్నికలు ఖాయమని పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తోంది. ఈ సమయంలో ఏపీలో ముందస్తు ఎన్నికల పైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల క్లారిటీ ఇచ్చారు. వైసీపీ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నే నమ్ముకుందని స్పష్టం చేసారు. సర్వే నివేదికలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
తెర పైకి ముందస్తు ప్రచారం : ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ ఏపీలో ముందస్తు ప్రచారం మరోసారి తెర పైకి వచ్చింది. ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే లో ఏపీతో పాటుగా మరో మూడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరగాల్సి ఉంది.

కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ముందస్తుగానే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను కలిపి నిర్వహించేలా ఆలోచన జరుగుతోందని..ఏకంగా తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల వేళ లోక్ సభకు ముందస్తుగా ఎన్నికలు జరిగే అకవాశం ఉందంటూ ప్రచారం సాగింది. గతంలో ఇటువంటి ప్రచారం జరిగ్గా, గత నెల జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు.
సీఎం జగన్ క్లారిటీ : ఏపీలో ముందస్తుకు అవకాశం లేదని ఆ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని.. అందరూ ఎన్నికలకు కష్ట పడాలని సీఎం నిర్దేశించారు. ఇప్పుడు సజ్జల అదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చారు. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని వెల్లడించారు.
ఈ విషయం పైన ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చామని గుర్తు చేసారు. పవన్ కల్యాణ్ పొత్తు ఖరారు చేసుకోవటానికి..ముందుకు రావటం కోసం టీడీపీ ఈరకమైన ముందస్తు ఎన్నికల ప్రచారం చేస్తుందని సజ్జల పేర్కొన్నారు. ముందస్తు ముచ్చట ప్రత్యర్ధి పార్టీల ముచ్చట మినహా వాస్తవం కాదని కొట్టి పారేసారు.
పవన్ కోసం టీడీపీ గేమ్ : మరో సారి వైసీపి అధికారం లోకి వస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూపించే ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ప్రజా తీర్పు ప్రకారం పదవీ కాలం ముగిసే వరకు ప్రభుత్వం కొనసాగుతుందని సజ్జల స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని..వెళ్లమని తేల్చేసారు.
అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం ఏపీ బీజేపీ నేతలు కేంద్రంతో చర్చిస్తున్నారని తమ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో సజ్జల ముందస్తుకు అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా వ్యూహం ప్రకారం చేస్తున్న ప్రచారంగా కొట్టి పారేసారు. సజ్జల క్లారిటీతో ముందస్తు ఎన్నికల ప్రచారం సరి కాదని తేలింది.












Click it and Unblock the Notifications