ఆ ఇద్దరు మాజీ మంత్రులు దొరికేసారా..!! బినామీలకే అత్యధిక ప్లాట్లు..! ప్రభుత్వానికి కీలక నివేదక..!
రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం..తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రకటనకు ముందు ఈ ప్రాంతంలో జరిగిన అసైన్డ్ భూముల కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన అసైన్డ్ భూములకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులుపెద్ద ఎత్తున లబ్ధిపొందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో సహా నిర్ధారణ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసిన ప్లాట్లను పంపిణీ చేసిన 450 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. దాదాపుగా ఈ ప్లాట్లన్నింటినీ అసైన్డ్ భూములు పొందిన అసలు యజమానులు కాకుండా ఇతరులు దక్కించుకున్నట్లు ఈ పరిశీలనలో తేలింది. ఇలా ప్లాట్లను దక్కించుకున్న ఇతరులలో అత్యధికులు ఆ ఇద్దరు మాజీ మంత్రి బినామీలుగా కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఇద్దరు మాజీలపైన ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారింది.
ఇద్దరు మాజీ మంత్రుల బినామీలకే..
రాజధాని నిర్మాణం పేరుతో నాటి ప్రభుత్వం సమీకరణించిన భూముల్లో..అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ఇద్దరు మాజీ మంత్రుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లు గా తెలుస్తోంది. ఇద్దరు మాజీ మంత్రులు బినామీల పేర్లతో లబ్ది పొందారనే సమాచారం ఆధారాలతో సహా ప్రభుత్వ వద్దకు చేరిందని విశ్వసనీయ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది..రాజధాని వ్యవహారాల్లో కీలకం వ్యవహరించిన ఒక మాజీ మంత్రితో పాటుగా..రాజధాని జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది.
అసైన్డ్ భూముల వ్యవహారంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని తేలినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసిన ప్లాట్లను పంపిణీ చేసిన 450 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. దాదాపుగా ఈ ప్లాట్లన్నింటినీ అసైన్డ్ భూములు పొందిన అసలు యజమానులు కాకుండా ఇతరులు దక్కించుకున్నట్లు ఈ పరిశీలనలో తేలింది. ఇలా ప్లాట్లను దక్కించుకున్న ఇతరులలో అత్యధికులు ఆ ఇద్దరు మాజీ మంత్రుల బినామీలుగా కూడా గుర్తించినట్లు సమాచారం.
ఇద్దరు మంత్రులకు పరోక్ష లబ్ది..
తొలుత ప్రాధమిక సమాచారం అందటంతో..ప్రభుత్వం తమ పరిధిలోని ఏజెన్సీలతో పూర్తి సమాచారం రాబట్టారు. ఆ మాజీ మంత్రులకు.. ప్లాట్లు దక్కించు కున్న వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాలను కూడా దాదాపుగా నిర్ధారించినట్లు తెలిసింది. దాదాపుగా ఈ లావాదేవీలన్నింటిలోనూ అసైన్డ్ భూముల వాస్తవ లబ్ధిదారులను బెదిరించారని, వారి నుండి నామ మాత్రపు ధరకు భూములను సొంతం చేసుకుని, ఆ తరువాత సమీకరణకు ప్రభుత్వానికి అప్పగించినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ఇలా చేయడం వల్ల ఆర్థికంగా భారీ లాభం పొందడంతో పాటు, సమీకరణ కోసం స్వచ్ఛందంగా భూములు అప్పగించినట్లు రాజకీయ ప్రచారాన్ని విస్తృతంగా చేసుకున్నారని భావిస్తున్నారు. మరో 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లోనూ ఇదే రకమైన మాయాజాలం చోటుచేసుకుని ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని కూడా పూర్థిస్తాయిలో పరిశీలించనున్నారు. ఆ తరువాత అధికారికంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
న్యాయపరమైన అంశాలపై..చర్యల దిశగా..
బినామీ లావాదేవీలను గుర్తించకూడదని, అసైన్డ్ భూముల వాస్తవ లబ్ధిదారులకే సమీకరణ ఫలితాలను అందజేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించింది. అభివృద్ధిచేసి ఇచ్చిన ప్లాట్లు కొన్నింటికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తైన విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.
1977 అసైన్డ్ చట్టం ప్రకారం ఈ తరహా లావాదేవీలను రద్దు చేసేందుకు అధికారం ఉన్నా ఇతర చిక్కులు ఎదురైతే పరిస్థితి ఏమిటనే అంశంపై సిఆర్డిఎ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎవరికి ప్రమేయం ఉన్నా వదిలేది లేదని, ప్రస్తుతం 450 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేసి వాస్తవ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. అసెంబ్లీలో రాజధాని అంశం చర్చకు వచ్చిన వేళ.. దీని పైన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. అయితే, పూర్తి ఆధారాలు ..న్యాయ పరమైన అంశాల పైన స్పష్టత తీసుకున్న తరువాతనే ఆ మాజీ మంత్రుల పైన చర్యల దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.