అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ -గ్యారంటీల పరిమితి రెట్టింపు : భారీగా రుణం పొందేలా ..!!
ఆర్దికంగా సమస్యల సుడి గుండంలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇటు రెవిన్యూ పెంపు..అటు అప్పుల కోసం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అప్పుడు ప్రశ్నించకుండా.. ఇప్పుడు తమకు రుణ పరిమితి పెంపుకు అంగీకరించపోవటం ఏంటంటూ ముఖ్యమంత్రి జగన్ నిలదీసారు. తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ లోనే అమిత్ షా సమక్షం లో దీనిని ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాజా అసెంబ్లీ సమావేశాల్లో కీలక చట్ట సవరణ చేసింది.
గ్యారంటీల పరిమితి రెట్టింపు
అప్పులకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల పరిమితిని రెట్టింపు చేసింది. మరింత అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ చట్టం నాలుగో భాగంలో 'డి' క్లాజును మార్చారు. 2005 చట్టంలో '90%' అని ఉన్నచోట '180%' అని మారుస్తున్నట్లు ప్రతిపాదించారు. దానికి సభ ఆమోదం తీసుకున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు లభించింది. ఇంతకుముందు కార్పొరేషన్లు అప్పులు తీసుకునేందుకు గ్యారంటీలు ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేసుకుంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు లక్ష కోట్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం అందులో 90%.. అంటే రూ.90 వేల కోట్ల వరకు ఉండొచ్చు. తాజా సవరణతో ఆ గ్యారంటీల పరిమితిని రూ.1.80 లక్షల కోట్లకు పెంచారు. కొద్ది రోజుల క్రితం ఆర్ఈసీ, పీఎఫ్సీ ప్రతినిధులు తామిచ్చిన రుణాల వసూలుకు నేరుగా రాజధానికి వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రభుత్వ కంపెనీ రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే అది దేశ విద్యుత్తు రంగంపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని సైతం ఆర్ఈసీ ఛైర్మన్ సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు రూ.25వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. తన గ్యారంటీ పరిమితి దాటిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందంటూ వివాదమైన విషయం తెలిసిందే. తాము గ్యారంటీలు ఇచ్చామే తప్ప ఆ గ్యారంటీలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదంటూ ప్రభుత్వం ఒక వాదన వినిపించింది. కేంద్ర ఆర్థిక వ్యయవిభాగం కూడా ఈ అంశాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం తన రుణ గ్యారంటీ పరిమితిని రెట్టింపు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినా, వాటిలో చాలా సంస్థలు వ్యాపారాలు చేయట్లేదు. దాంతో ఆదాయం రావట్లేదు.
Recommended Video
అవి స్వయంగా ఆ రుణాలు తీర్చలేవు. ఆ అప్పులు తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయేరోజుల్లో ఈ అప్పుల భారం ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ విధంగా తీర్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడు సంక్షేమ పధకాల అమల..ప్రభుత్వ నిర్వహణ ఖర్చులే ఇబ్బందిగా మారుతున్న సమయంలో ప్రభుత్వానికి రుణాలు మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదనే వాదన ఉంది. దీంతో.. కేంద్రం నుంచి రుణపరిమితి పెంపు పైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రమే ఇప్పుడు ఈ సవరణ ద్వారా మరో 90 వేల కోట్ల వరకు రుణానికి అవకాశం ఏర్పుడుతుంది. అయితే, పూర్తిగా అప్పులే మినహా.. రెవిన్యూ మార్గాల పైన ఫోకస్ పెట్టటం లేదనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications