ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక సెలవులు ఇవీ : వ్యాధులకు ఎక్స్గ్రేషియా ఇలా..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పీఆర్సీ అమలు పైన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..తాజాగా 11వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్గ్రేషియా ఖరారు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఇక నుంచి వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు.
సెలవులు పెంచుతూ
హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. పీఆర్సీ సిఫార్సుల్లో భాగంగా.. పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగుల విషయంలో కీలక అంశాలను ప్రస్తావించింది.
వర్తించేది ఎవరికంటే
ఈ మేరకు పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవి వర్తించవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
వ్యాధులకు ఎక్స్ గ్రేషియా పెంపు
ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.